జీడిమెట్ల, మార్చి 26: ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరితోపాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని కూడా జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. మంగళవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ ఎసీపీ జి.హనుమంతరావు, ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాస్ రావు, డీఐ విజయ్ నాయక్ వివరాలను వెల్లడించారు. గాజులరామారం డివిజన్ నెహ్రూనగర్కు చెందిన గోగుల దేవసహాయం (27), మెదక్ జిల్లా.. ధర్మసాగర్ గ్రామానికి చెందిన రెడ్డి రమేశ్ (27) మధ్య కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. సులువుగా డబ్బులు సంపాదించేందుకు వీరిద్దరు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు అలవాటు పడ్డారు. తాళం వేసి ఉన్న బైక్లను మారు తాళం చెవితో తాళం తీసి, చోరీలకు పాల్పడ్డారు. అనంతరం చోరీ చేసిన బైక్లను కళావతి నగర్కు చెందిన మన్నెరాజు (37)కు అప్పగించి డబ్బులు తీసుకుని జల్సాలు చేశారు. సోమవారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పద స్థితిలో దేవ సహాయం, రెడ్డి రమేశ్ కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తూ పోలీసుల కంటపడ్డారు. వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 8 వాహనాలు, సూరారం పోలీస్ స్టేషన్ 4, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ 1, నర్సాపూర్ పోలీస్ స్టేషన్ 1, కామారెడ్డి పోలీస్ స్టేషన్ 1, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ 1, మెదక్ పోలీస్స్టేషన్ 1., మొత్తం 17 ద్విచక్ర వాహనాలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వీరు దొంగిలించిన బైకులను మన్నెరాజుకు విక్రయించగా.. మన్నెరాజు కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన బైక్ మెకానిక్ శివకుమార్ గౌడ్కు విక్రయించాడు. శివకుమార్, మన్నెరాజు వద్ద నున్న 17 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.