చంపాపేట, మే 24: వారంతా ప్రాణ స్నేహితులు.. దైవదర్శనానికి వెళ్లి.. ఎంతో ఆనందంగా తిరుగు ప్రయాణమయ్యారు.. ఇంకో గంటలో ఇంటికి చేరుకునేవారే.. అంతలోనే బస్సు రూపంలో మృత్యువు కబళించింది. రాంనుంతల గేట్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు.
గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన బుర్ర శ్రీనివాస్ గౌడ్ లక్ష్మి దంపతులు 30 ఏండ్లుగా చంపాపేట డివిజన్ బైరమాల్గూడ సాయినగర్ కాలనీలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఓ కుమారుడు అనిల్ గౌడ్ యూఎస్లో ఉద్యోగం చేస్తుండగా, చిన్న కుమారుడు బుర్ర మణిదీప్గౌడ్ (25) నగరంలో ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. మణిదీప్గౌడ్, హస్తినాపురం డివిజన్ ద్వారకానగర్ కాలనీకి చెందిన శివకృష్ణ వరప్రసాద్ గౌడ్ (25), బాలాపూర్లో ఉండే నల్లగొండ జిల్లా నాంపల్లి రాందాస్ తండాకు చెందిన మేగావత్ అఖిల్ (26) ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు.
గురువారం వీరంతా కలిసి కారులో దైవదర్శనం కోసం శ్రీశైలం వెళ్లారు. శుక్రవారం తిరుగు ప్రయాణమవ్వగా, మణిదీప్గౌడ్ కారును నడుపుతున్నాడు. అమన్గల్ సమీపంలోని ప్రధాన రహదారిలో ఉండే రాంనుంతల గేట్ వద్దకు రాగానే శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి కారును ఢీకొట్టింది. ఘటనాస్థలిలోనే ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.