అంబర్పేట, ఏప్రిల్ 22: రాత్రిపూట రోడ్డు పక్కన ఉన్న ఫుట్పాత్లు, ఆటోలలో నిద్రిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేసుకొని స్నాచింగ్, దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని నల్లకుంట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక కత్తి, త్రిశూల్, బ్లేడ్, రెండు బైక్లు, మూడు సెల్ఫోన్లు, రూ.1600 నగదును స్వాధీనం చేసుకున్నారు. నల్లకుంట పీఎస్లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఓయూ ఏసీపీ జగన్, నల్లకుంట ఇన్స్పెక్టర్ బి.జగదీశ్వర్రావు, లాలాగూడ ఇన్స్పెక్టర్ రమేశ్గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు. బోరబండ, ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన రమేశ్, వెంకటస్వామి, కార్తిక్గౌడ్ కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. చెడు అలవాట్లకు బానిసైన వీరు డబ్బు కోసం నేరాల బాటపట్టారు.
ఇందుకు ప్లాన్ వేసుకున్నారు. రాత్రిపూట రోడ్డు పక్కన, ఫుట్పాత్పై, ఆటోలలో నిద్రిస్తున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ.. వారిని బెదిరించి వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, డబ్బులు, అవసరమైతే వారి వాహనాలను కూడా దొంగిలిస్తున్నారు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో జీవితాన్ని సరదాగా గడపాలని ప్లాన్ వేసుకున్నారు. నందకుమార్ అనేవ్యక్తి ఈ నెల 13న రాత్రి మద్యం సేవించాడు. బైక్పై మెట్టుగూడ మెట్రోస్టేషన్ మీదుగా వెళ్తూ.. మత్తులో బైక్ నడిపించడం వీలుకాకపోవడంతో బస్టాపులో బైక్ను పార్కింగ్ చేశాడు. సెల్ఫోన్ జేబులో పెట్టుకొని అక్కడే పడుకున్నాడు. కొంత సమయం తర్వాత నిద్రలేచి చూడగా.. పార్కింగ్ చేసిన బైక్, జేబులోని సెల్ఫోన్ కనిపించలేదు.
దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే, ఈ నెల 17న తెల్లవారుజామున రమావత్ రాజు నల్లకుంట మోడల్ రైతు చికెన్బజార్ వద్ద ఫుట్పాత్పై పడుకున్నాడు. ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి.. అతడిని కత్తితో బెదిరించారు. అతడి వద్ద నుంచి మొబైల్, రూ.3వేల నగదు దొంగిలించుకొని పారిపోయారు. అతడు నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఎస్సై కృష్ణ, క్రైమ్ సిబ్బందితో కలిసి బోరబండలో ఉంటున్న రమేశ్, వెంకటస్వామి, కార్తిక్గౌడ్ను పట్టుకున్నారు. నిందితులు ఎస్సార్నగర్, లాలాగూడ, నల్లకుంట, జీడిమెట్ల, కూకట్పల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు కృష్ణ, శ్రీనివాసరావు, రమాదేవి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందికి రివార్డులు ఇవ్వనున్నట్లు ఏసీపీ జగన్ ప్రకటించారు.