బంజారాహిల్స్,సెప్టెంబర్ 1: యాంటీ క్రైం బ్రాంచ్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని ఫోన్లో ఓ వ్యాపారిని బెదిరించిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరొకరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఫిలింనగర్ రోడ్ నెం 7లో నివాసం ఉంటున్న సయ్యద్ మహ్మద్ ఫజల్ అనే వ్యాపారికి చెందిన ఓ భవన నిర్మాణపనులు పేట్బషీ రాబాద్లో సాగుతున్నాయి.
ఈ పనులకు సంబంధించి రాజ్కుమార్ అనే కాంట్రాక్టర్తో ఇటీవల ఫజల్కు గొడవలు ఉన్నాయి. తీసుకున్న పనులను అసంపూర్తిగా చేయడంతో పాటు నాణ్యత లేకపోవడంతో అతడికి ఇవ్వాల్సిన బిల్లులను అపేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28న మహ్మద్ అమర్ అనే వ్యక్తి మహ్మద్ ఫజల్కు ఫోన్ చేశాడు. తాను నాంపల్లిలో యాంటీ క్రైం బ్రాచ్ ఆఫీస్నుంచి మాట్లాడుతున్నానని, రాజ్కుమార్కు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇంటిమీదకు రౌడీలను పంపిస్తానని, సైట్వద్దకు మనుషులను పంపించి భవనాన్ని కూల్చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు.
తాము చెప్పినట్లు వినకపోతే అంతుచూస్తామని హెచ్చరించాడు.
ఈ మేరకు తీవ్ర భయాందోళనలకు గురయిన మహ్మద్ ఫజల్ ఆరా తీయగా అమీర్ అనే వ్యక్తి సోషల్ వర్కర్ అని చెప్పుకుంటూ ఇదే విధంగా బెదిరింపులకు పాల్పడుతుంటారని తేలింది. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు అమీర్తో పాటు అతడిచేత ఫోన్ చేయించిన రాజ్కుమార్ మీద ఐపీసీ 419,384,506,507 రెడ్విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.