కేపీహెచ్బీ కాలనీ, జూన్ 23 : ‘ఈ భవనం శిథిలావస్థ స్థితిలో ఉంది! సురక్షితమైనది కాదు! ఎప్పుడైనా కూలిపోవచ్చు! మీ ప్రాణాలకు ముప్పు ఉంది! ఈ భవనాల్లో నివసించడం, సంచరించడం నిషేధం. ఈ భవనంలోకి ఎవరూ వెళ్లొద్దు’ అంటూ జీహెచ్ఎంసీ అధికారులు భద్రత కోసం హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు. వర్షాకాల నేపథ్యంలో శిథిలావస్థ భవనాలపై కూకట్పల్లి జోనల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టిని సారించింది. కాలం చెల్లిన భవనాల్లో నివసించడం, వ్యాపారాలు నిర్వహించడం వల్ల ప్రమాదం తలెత్తే అవకాశముండడంతో భద్రత కోసం పటిష్టమైన చర్యలు ప్రారంభించారు.
దీనిలో భాగంగా కూకట్పల్లి జోనల్ పరిధిలోని ఐదు సర్కిళ్ల పరిధిలో శిథిలావస్థ భవనాలను గుర్తించి అత్యంత ప్రమాదకరంగా ఉన్నవాటిని కూల్చివేసే పనులను మొదలుపెట్టారు. తక్కువ ప్రమాదమున్న భవనాలకు నోటీసులు జారీ చేసి, నిరుపయోగంగా ఉన్న శిథిలావస్థ భవనాలను సీజ్ చేస్తున్నారు. మరమ్మతులు చేసుకునే అవకాశమున్న భవన యజమానులకు అవగాహన కల్పిస్తూ తక్షణమే మరమ్మతులు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రాణనష్టాన్ని నివారించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
గుర్తించినవి 79.. కూల్చినవి 11
కూకట్పల్లి జోన్ పరిధిలో మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లు ఉన్నాయి. ఈ యేడాది చేపట్టిన శిథిలావస్థ భవనాల గుర్తింపు సర్వేలో ఐదు సర్కిళ్లలో కలిపి 79 భవనాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో 11 భవనాలను ఇప్పటికే కూల్చివేయగా మరికొన్ని భవనాలను త్వరలోనే కూల్చివేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న 36 భవనాలకు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.
ప్రమాద నివారణకు చర్యలు..
శిథిలావస్థ భవనాలను గుర్తించి ప్రమాదాలను నివారించేలా చర్యలు ప్రారంభించాం. సర్కిళ్ల వారీగా శిథిలావస్థ భవనాలను గుర్తించి ప్రమాదకరమైన వాటిని కూల్చివేయాలని టౌన్ప్లానింగ్ అధికారులకు సూచించడం జరిగింది. గుర్తించిన శిథిలావస్థ భవనాలలో ప్రజలు నివాసముంటే వాటిని ఖాళీ చేయించేలా చర్యలు తీసుకుంటున్నాం. భవన యజమానులందరికీ నోటీసులు జారీ చేయడం.. ప్రమాదకరమైన వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. శిథిలావస్థ భవనానికి పెయింటింగ్తో కూడిన హెచ్చరిక నోటీసులు అతికిస్తున్నాం.
– వి.మమత, జోనల్ కమిషనర్, కూకట్పల్లి