ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 12: సెల్ఫోన్ టవర్ల నుంచి సిగ్నళ్లు స్వీకరించే రిమోట్ రేడియో యూనిట్లను (ఆర్ఆర్యూ) చోరీ చేస్తున్న ముఠా గుట్టును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.45 లక్షల విలువైన ఆర్ఆర్యూలను స్వాధీనం చేసుకున్నారు. ఓయూ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ బి. సాయిశ్రీ వివరాలు వెల్లడించారు. ఇటీవల మాణికేశ్వరీనగర్లోని సెల్ టవర్ నుంచి ఆర్ఆర్యూ చోరీ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. చోరీ జరిగిన సొత్తును గుర్తించారు. స్క్రాప్ వ్యాపారి అబ్దుల్ హమీద్ (33)ను అదుపులోకి తీసుకొని విచారించారు. నిందితులు భూక్యా అఖిల్ (20), గుగులోత్ తరుణ్ (22), గుగులోత్ ప్రవీణ్ (24)ను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆర్ఆర్యూలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు ఖాజా మొయినుద్దీన్, షాదాబ్ పరారీలో ఉన్నారు.