ఖైరతాబాద్, డిసెంబర్ 16 : భవన నిర్మాణాలు జరిగే చోట సెంట్రింగ్ స్టీల్ దొంగతనాలు నగరంలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వాటిని అరికట్టాలని శ్రీ సిద్ధి వినాయక వెల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.యాదగిరి కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా సమయంలో చైనా భారత్కు స్టీల్ ఎగమతిని నిలిపివేసిందని, దీంతో 30 శాతానికి పైగా రేట్లు పెరిగాయన్నారు. ఫలితంగా అనేక మంది వ్యాపారులు తమ షాపులను మూసివేశారన్నారు.
అయితే భవన నిర్మాణాలు జరిగే చోట కొందరు ముఠాగా ఏర్పడి వాటిని దొంగతనాలకు తెరలేపారన్నారు.సెంట్రింగ్ స్టీల్ను దొంగతనం చేయడంతో పాటు మార్కెట్లో స్క్రాప్ ధరకు విక్రయిస్తున్నారని, వాటిని విక్రయించే సంస్థలు లాభాలు లేక మూతపడుతున్నాయన్నారు. ఎక్కువ శాతం రాత్రి వేళల్లో నంబర్ ప్లేట్ లేని వాహనాలపై సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్నారని, వాటిని భోలక్పూర్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆదాయంతో పాటు జీఎస్టీకి గండికొడుతూ, మరో వైపు విక్రయదారులను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.