సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): పుణె దొంగలు నగరంపై కన్నేశారు. ఓ నాలుగు ఇండ్లలో చోరీలు చేశారు. ఎవరికీ దొరకమనే ధీమాతో సొంతూరు పారిపోయారు. ఎక్కడా ముఖాలు కనిపించకుండా మాస్కులు వేసుకొని జాగ్రత్త పడ్డారు.. కేసును సవాల్గా తీసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి.. నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 10 లక్షలు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శనివారం బషీర్బాగ్లోని సిటీ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ అంజనీకుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన సంగట్ సింగ్ అలియాస్ కల్యాణి.. గొర్రెలు, పందుల పెంపకాన్ని చేపట్టేవాడు. దాని ద్వారా వచ్చే ఆదాయం జల్సాలకు సరిపోకపోవడంతో దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. 2005 నుంచి పుణెలో 17 చోరీలు చేసి.. చాలాసార్లు దొరికిపోయాడు. ఇక లాభం లేదనుకొని.. తన దొంగతనాలకు హైదరాబాద్ను ఎంచుకున్నాడు.
అక్షయ్ పొపాట్ను తన అనుచరుడిగా పెట్టుకొని..ఈ నెల 6న అతడిని హైదరాబాద్కు రావాలని నంబరు ప్లేటు మార్చిన ద్విచక్రవాహనాన్ని ఇచ్చాడు. సంగట్ మాత్రం బస్సులో మియాపూర్ చేరుకున్నాడు. మరుసటి రోజు ఇద్దరు కలిసి మారేడ్పల్లిలో రెండు, కాచిగూడ, అంబర్పేట్ పీఎస్ పరిధుల్లో రెండు ఇండ్లను దోచుకున్నారు. సంగట్ బస్సులో బయలుదేరగా, అతడి అనుచరుడు అక్షయ్ సంగారెడ్డిలో ఓ లాడ్జిలో ఉండి తిరిగి పుణె వెళ్లిపోయాడు. ఈ చోరీ కేసులను దర్యాప్తు చేపట్టిన టాస్క్ఫోర్స్ పోలీసులు సుమారు 500 కెమెరాలను నిశితంగా పరిశీలించారు. నిందితులు తమ ఆనవాలు కనిపించకుండా మాస్కులు ధరించడంతో ఆచూకీ తెలియలేదు.
అయితే సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్న క్రమంలో లాడ్జి వద్ద ప్రధాన నిందితుడి అనుచరుడు ఓ నిమిషం పాటు మాస్కును తొలగించడాన్ని గుర్తించారు. ఆధారాలు సేకరించి.. శనివారం ఇద్దరు నిందితులతో పాటు వీరి వద్ద నుంచి బంగారాన్ని కొనుగోలు చేసిన విక్రమ్సింగ్ రాజ్ఫుత్ను అరెస్టు చేశారు. మరో రిసీవర్ పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. నిందితులను పట్టుకున్న టాస్క్ఫోర్స్, మారేడ్పల్లి పోలీసులను అభినందించారు. సమావేశంలో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్రావు, నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్ఐలు శ్రీకాంత్, పరమేశ్వర్, అశోక్రెడ్డి, శివానందం, సిబ్బంది పాల్గొన్నారు.