కారు అద్దాలు పగులగొట్టి… రూ.5లక్షలు దొంగిలించిన కేసులో ముగ్గురు నిందితులను వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 7 రోజుల్లోనే వారిని పట్టుకుని, రూ.4.91లక్షలు, మూడు బైక్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురం డీఐ జగన్నాథ్ వివరాల ప్రకారం..కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండలం, సిద్ధాపూర్ గ్రామానికి చెందిన ఇరగదిన్నెల బెంజ్మన్, పీట్ల మల్లికార్జున్, ఆత్మకూర్కు చెందిన ఉప్పతోలు ఇశ్రాయేల్ ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 16న గడ్డిఅన్నారంకు చెందిన ఎం.నర్సింహ తన ప్లాటును విక్రయించగా ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద .. దానికి సంబంధించిన రూ.5లక్షలను కారులో పెట్టాడు. ఈ విషయాన్ని ఆ ముగ్గురు గమనించి ఎలాగైనా ఆ డబ్బును కొట్టేయాలనుకున్నారు.. నర్సింహ .. జడ్జెస్ కాలనీలో స్నేహితుడు శ్రీకాంత్రెడ్డి మృతి చెందడంతో అక్కడికి వెళ్లి కారును పార్కుచేసి లోనికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన ఆ ముగ్గురు కారు వెనుక అద్దం పగులగొట్టి అందులో ఉన్న రూ.5లక్షలు తీసుకుని పారిపోయారు. కొద్దిసేపటి తర్వాత వచ్చిన బాధితుడు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. గురువారం ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.