అంబర్పేట : రైల్వేట్రాక్ల వెంట ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న పాత దొంగను నల్లకుంట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని నుంచి రూ.2.25లక్షల విలువగల 7.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి గురువారం నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇన్స్పెక్టర్ మొగిలిచెర్ల రవి, డీఐ కిషన్లతో కలిసి ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ మురళీధర్ గురువారం వివరాలను వెల్లడించారు. ఈ నెల 14న తిలక్నగర్ రైల్వేట్రాక్ పక్కనే నివాసముంటున్న ఆదర్శ్ కుమార్ తండ్రి ఇంట్లో దొంగతనం జరిగింది.
ఇంట్లోని ఆల్మారలో ఉన్న 7.5 తులాల బంగారం చోరీకి గురైంది. దీంతో ఆదర్శ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దొంగతనం జరిగిన ఇంట్లో సేకరించిన పింగర్ ఫ్రింటు ఆధారంగా దొంగతనం చేసింది పాత దొంగ అనంతపురం జిల్లా కొండపల్లికి చెందిన తిమ్మసముద్రం శివగా గుర్తించారు.
ఇతను 9 ఏళ్ల వయసులోనే ఇంటిని వదిలిపెట్టి బయటకు వచ్చాడు. హైదరాబాద్కు వచ్చి డ్రైవర్, వాచ్మెన్ ఉద్యోగాలను చేస్తుండేవాడు. అవసరాలకు తగ్గ డబ్బులు లేకపోవడంతో ఇండ్లలో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 72 దొంగతనాలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు.
గత నెలలో జైలు నుంచి బయటకు వచ్చి నల్లకుంట పీఎస్ పరిధిలో దొంగతనానికి పాల్పడ్డాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తిమ్మసముద్రం శివను గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన నల్లకుంట క్రైం బృందాన్ని అడిషనల్ డీసీపీ అభినందించారు.