వెంగళరావునగర్, మే 24: భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో మామపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన మధురానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యాదగిరినగర్కు చెందిన రామారావు (65) కుమార్తె మాధవి అలియాస్ శరణ్య(28)కు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో భర్త చనిపోయాడు. ఇద్దరు బిడ్డలతో ఉంటున్న శరణ్యకు జీవితంలో ఓ తోడు కోసం మరో పెండ్లి చేయాలని తండ్రి రామారావు భావించాడు. ఏపీలోని పాలకొల్లుకు చెందిన సుబ్రహ్మణ్యం(32)తో మూడు నెలల కిందట వివాహం జరిపించారు. పాలకొల్లులో స్వీట్ షాప్ నడిపే అతడు.. భార్యతో పాటు ఆమె ఇద్దరు పిల్లలను నెల రోజుల పాటు బాగానే చూసుకున్నాడు. ఆ తర్వాత భార్యపై అనుమానం పెంచుకున్నాడు. రెండో భర్తగా జీవితంలోకి ప్రవేశించిన సుబ్రహ్మణ్యం పెట్టే వేధింపులను కొన్నాళ్లు బిడ్డల కోసం శరణ్య భరించింది.
మద్యం సేవించి ఇంటికి వచ్చే అతడు భార్యను అనుమానిస్తూ శారీరకంగా, మానసికంగా పెట్టే వేధింపులు తీవ్రం కావడంతో పుట్టింటికి వచ్చింది. తన భార్యను కాపురానికి పంపాలని.. ఖాతరు చేయకుంటే చంపేస్తానని అత్తింటి వారిని బెదిరించాడు. భర్త వేధింపులపై ఆమె తండ్రితో కలిసి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫ్యామిలీ కౌన్సెలింగ్ కోసం యూసుఫ్గూడ మహిళా పోలీసు స్టేషన్కు పంపించారు. శుక్రవారం మధ్యాహ్నం అత్తింటికి వచ్చిన సుబ్రహ్మణ్యం మామ రామారావుతో గొడవ పడ్డాడు. వెంట తెచ్చుకున్న బ్లేడ్తో రామారావు గొంతు కోశాడు. సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న రామారావును చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సుబ్రహ్మణంను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.