మియాపూర్ , జనవరి 21 : అల్లం మాటున గంజాయిని ఇతర రాష్ర్టాల్లో విక్రయించేందుకు తరలిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. డీసీఎం వాహనంలో ఒడిశా నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా తరలిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. శంషాబాద్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో సుమారు రూ.1.80 కోట్ల విలువ చేసే 800కిలోల గంజాయితో పాటు ఆరుగురు ముఠా సభ్యులను, కారు, డీసీఎంతో పాటు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబారాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వివరాలు వెల్లడించారు.
మహారాష్ట్ర నాసిక్కు చెందిన ప్రధాన సూత్రదారి వికాస్ జాదవ్, ప్రధాన విక్రయేత సుభాష్కుమార్తో పాటు అశోక్ కుహాలే, అమోల్ అథవాలే, రాహుల్కుమార్ సింగ్, విలాస్ జగన్నాథ్ పచోరీ, ఫిరోజ్ మోమిన్, సుధమ్ ఘోటేకర్లు ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి మహారాష్ట్రలో పెద్ద ఎత్తున గంజాయి విక్రయించాలని పథకం పన్నారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ ఫారెస్ట్ ప్రాంతం నుంచి డీసీఎం (MH 15 FV 8869 ) వాహనంలో 800 కిలోలున్న 156 గంజాయి ప్యాకెట్లను నింపుకుని హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు ప్రయాణమయ్యారు. డీసీఎం ఎదుట ఐ20 కారు ఎస్కార్ట్గా టోల్ గేట్లు లేకుండా సర్వీస్ రోడ్డు మీదుగా నగరం దాటేందుకు యత్నించారు. కాగా దీనిపై శంషాబాద్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులకు సమాచారం అందటంతో శుక్రవారం ఉదయం మియాపూర్ కూడలి వద్ద డీసీఎంకు ఎస్కార్ట్గా ఐ20 కారులో వెళ్తున్న అశోక్, అమోల్ అథవాలేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారించగా డీసీఎం వాహనం కింది భాగంలో పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లతో నింపి.. పై నుంచి అల్లం బస్తాలను పరిచినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితులైన వికాస్ జాదవ్, సుభాష్కుమార్ పరారీలో ఉండగా.. మిగిలిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1.80 కోట్ల విలువైన 800 కిలోల గంజాయి, డీసీఎం, ఐ20 కారు సహా 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
గంజాయి విక్రయిస్తే వదలం
నిషేదిత గంజాయిపై తెలంగాణ రాష్ట్రంలో ఉక్కు పాదం మోపుతున్నామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. గంజాయి విక్రయేతలు, వినియోగదారులను ఎవరినీ వదలడం లేదని స్పష్టం చేశారు. కాగా ఈ అంతర్రాష్ట ముఠాపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్న శంషాబాద్ ఎస్వోటీ పోలీసులను, మియాపూర్ పోలీసులను అభినందించారు. ఈ సమావేశంలో మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ కృష్ణప్రసాద్, మియాపూర్ సీఐ తిరుపతిరావు, ఎస్వోటీ సీఐ వెంకటరెడ్డి, ఎస్వోటీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.