మణికొండ/బండ్లగూడ/చాదర్ఘాట్/అత్తాపూర్/వ్యవసాయ యూనివర్సిటీ/సైదాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన’ ఆరు గ్యారెంటీల అమలు కార్యక్రమం మొదటి రోజు ప్రజల ఆగ్రహానికి గురైంది. రాజేంద్రనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మణికొండ, నార్సింగి, శంషాబాద్, అత్తాపూర్, హైదర్గూడ, బండ్లగూడ, పలు ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో చాలాచోట్ల ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు నిరుత్సాహానికి గురయ్యారు.
కొన్నిచోట్ల దరఖాస్తు ఫారాలులేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని పలు చోట్ల సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తమ దరఖాస్తులు ఎవరికి ఇవ్వాలో తెలియక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తు చేసుకోమని సర్కారు సూచించినా స్వీకరించేందుకు అధికారులు లేరని వారు వాపోయారు.
బండ్లగూడ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజాపాలనలో భాగంగా 22 డివిజన్లలో మొత్తం 53 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన గంట తర్వాత దరఖాస్తు ఫారాలు అయిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు జిరాక్స్ సెంటర్ వద్దకు వెళ్లి దరఖాస్తులు తెచ్చుకోవాలని ఉచిత సలహాలు కూడ ఇచ్చారు.
చాదర్ఘాట్: డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన నాలుగేసి సెంటర్లలో జిరాక్స్ దరఖాస్తులు స్వీకరించేందుకు తిరస్కరించడంతో స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
పాతబస్తీలో ఉర్దూలో దరఖాస్తుల బదులు తెలుగు ఫారాలు పంపిణీ జరగడంతో వాటిని పూర్తి చేసేందుకు స్థానికులు ఇబ్బందులుపడ్డారు. అదే విధంగా ఇంగ్లిష్లో దరఖాస్తులు స్వీకరించబడవని ప్రభుత్వం నుంచి అలాంటి ఫార్మాట్తో దరఖాస్తులు ముద్రించలేదని మలక్పేట సర్కిల్ స్పెషల్ ఆఫీసర్ వి.కృష్ణ తెలిపారు. మలక్పేట సర్కిల్ మొత్తానికి కేవలం 15,000 దరఖాస్తులు ప్రభుత్వం నుంచి సరఫరా కావడంతో వాటిని సెంటర్ల వారీగా ఇన్చార్జిల వద్ద ఉంచారు. సెంటర్లు ప్రారంభమైన స్వల్ప వ్యవధిలోనే స్థానికులకు పంపిణీ చేయడంతో తీవ్ర కొరత ఏర్పడింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని జిరాక్స్ కాపీ దరఖాస్తులను సెంటర్లకు పంపిణీ చేయడంతో సమస్య సమిసిపోయింది.
అభయహస్తంలోని మహాలక్ష్మి, గృహజ్యోతి, చేయూత, గ్యాసిలిండర్ గ్యారంటీలకు అర్హులైన వారందరు దరఖాస్తు చేసుకోవాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. ఛావునీ డివిజన్లోని గుడ్డిబౌలీ, షా కాలనీ కమ్యూనిటీ హాల్లో, ఆజంపురా డివిజన్లోని కాలాడేరా, షోహెబ్ లైబ్రరీ కమ్యూనిటీ హాల్లో సెంటర్లను ఎమ్మెల్యే పరిశీలించారు. అదేవిధంగా మలక్పేట సర్కిల్ ప్రజాపాలను స్పెషల్ ఆఫీసర్ కృష్ణ వివిధ సెంటర్లను సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. జిరాక్స్ కాపీ దరఖాస్తులను స్వీకరించాలని ఆదేశించారు.
అత్తాపూర్ : అత్తాపూర్ డివిజన్ పరిధిలోని అత్తాపూర్, హైదర్గూడ, పాండురంగానగర్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలే ఇంటర్నెట్, మీసేవలకు వెళ్లి దరఖాస్తులను కొనుగోలు చేసుకొని వచ్చిన పరిస్థితి కనిపించింది. డివిజన్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ల కోసం చాలా వరకు దరఖాస్తులు అధికం చేసుకున్నారు.
వ్యవసాయ యూనివర్సిటీ : రాజేంద్రనగర్ నియోజక వర్గం పరిధిలోని శాస్త్రీపురం, సులేమాన్నగర్ డివిజన్లలో అధికంగా ముస్లింలు ఉండటంతోపాటు ఎక్కడా కాంగ్రెస్ నేతలు కనిపించలేదు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక బీఆర్ఎస్ నాయకులు శాస్త్రీపురం డివిజన్ నాయకులు ఎండీ.ముఖ్రమ్ ఖాన్, సులేమాన్నగర్ డివిజన్ నాయకులు షేక్ నయ్యూమోద్దిన్ ఆధ్యర్యంలో పత్రాలను సామాన్యులకు అందజేశారు.
మణికొండ:గండిపేట మండల పరిధిలోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీలలో ఆరు గ్యారెంటీల ధరఖాస్తు సేకరణ ఆయా వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. మణికొండ మున్సిపల్ పరిధిలోని చిత్రపురి కాలనీలో కౌన్సిలర్లు ఐమాంజలి, వసంత్చౌహాన్, పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద కౌన్సిలర్లు రామకృష్ణారెడ్డి, కావ్యశ్రీరాములు, శైలజ, మీనాముత్యాలు, లక్ష్మీనారాయణ తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందించారు. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి గ్రామాల్లో మున్సిపల్ చైర్పర్సన్ రేఖయాదగిరి, యాదమ్మ, మాజీ ఎంపీటీసీ నగేశ్యాదవ్, ఖానాపూర్లో కౌన్సిలర్ అమరేందర్రెడ్డి, గండిపేట్లో కౌన్సిలర్లు, కోకాపేట్లో కౌన్సిలర్లు, నార్సింగిలో వైస్ చైర్మన్ వెంకటేశ్, కౌన్సిలర్లు అరుణజ్యోతి, పత్తి ప్రవీణ్, పత్తి శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్, మంచిరేవులలో కౌన్సిలర్లు పాల్గొని లబ్ధిదారులతో దరఖాస్తులను తీసుకున్నారు.
మణికొండలో రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కస్తూరి నరేందర్ పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి, మున్సిపాలిటీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కె.రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఫల్గుణ్కుమార్, డీఈ అరుణజ్యోతి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీరాములు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
సైదాబాద్: మలక్పేట, యాకుత్పురా నియోజకవర్గాల్లో ప్రజా పాలన ఐదు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ గురువారం సజావుగా కొనసాగింది. కౌంటర్ల వద్దకు ప్రజలు భారీగా తరలిరావటంతో చాలా కౌంటర్ల వద్ద గంటలోపే దరఖాస్తుల కొరత ఏర్పడింది. తమకు దరఖాస్తు ఫారాలు ఇవ్వాలని ప్రజలు అధికారులను, సిబ్బందిని నిలదీశారు. అధికారులు జిరాక్స్ తీసిన దరఖాస్తులను ఇవ్వడంతో ఆగ్రహించిన ప్రజలు వాటిని చింపివేసి, తమకు ఒరిజనల్ దరఖాస్తులనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌంటర్ల వద్ద ప్రజలకు ఇబ్బందులు లేకుండా టెంట్లు, బారీకేడ్లు, వాటర్ క్యాన్లను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్తం ప్రజా పాలన ఐదు గ్యారెంటీలకు అర్హులైన ప్రజలందరూ దరఖాస్తు చేసుకోవాలని మలక్పేట, యాకుత్పురా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు బలాల, జాఫర్ హుస్సేన్ మేరాజ్ ప్రజలకు సూచించారు. నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన పలు కేంద్రాలను వారు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి దరఖాస్తు స్వీకరణ కౌంటర్లను పరిశీలించారు. తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో దరఖాస్తులను అందుబాటులో పెట్టాలని అధికారులను కోరారు. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సుబ్రమణ్యంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తులను డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత స్థానికులు అందజేశారు. ఖాజాబాగ్, సింగరేణికాలనీలకు చెందిన ప్రజలకు ప్రజా పాలన దరఖాస్తులను టీపీసీసీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ ప్రజలకు అందజేశారు.