సిటీబ్యూరో, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : జనాభా విస్పోటనం, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, అంతరించిపోతున్న జీవవైవిధ్యం, కృత్రిమ రసాయనాల వినియోగం పర్యావరణంతోపాటు మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్నాయని పలువురు వక్తలు అన్నారు. హైదరాబాద్ కేంద్రంగా వైద్యులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు ప్రత్యేక బృందంగా ఏర్పడి నగరాల్లో విషతుల్యత ప్రభావంపై అధ్యయనం చేస్తున్నారు. బుధవారం అమీర్పేట్లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లోని ఆడిటోరియంలో నగరాల్లో విషతుల్యత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ… వ్యవసాయంలో పెస్టిసైడ్స్ వినియోగం, పర్యావరణంలో చేరుతున్న పాదరసం, కాడ్మియంతోపాటు బెంజీన్, టోలిన్, నికెల్, యాంటిమోనీ, క్రోమియం వంటి రసాయనాలు నిత్యం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరిపోతున్నాయని, దీంతో డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు క్రమంగా పెరుగుతున్నాయని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహనతోపాటు, జీవ వైవిధ్యాన్ని సంరక్షించుకుంటూ, సహజ సాగు విధానాలకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. డా.సక్సెనా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సంస్థ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రాతినిధ్యం వహించగా.. కార్యక్రమంలో డా.ప్రవీణ్ సక్సేనా, డా.కరుణ, డా.కె.బాబురావు, డా.ఎస్.సుధ, డా.దొంతి నరసింహారెడ్డి, డా.దినేశ్కుమార్, ఎన్ఐఎన్ పరిశోధకులు, వైద్యులు పాల్గొన్నారు.