కవాడిగూడ, మే 22: చేతి వృత్తులను ప్రోత్సహించి వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఆదుకోవాలని అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా రాష్ట్ర కమిటీ అధ్యక్షురాలు కోట దేవకీదేవి కోరారు. ఈ మేరకు బుధవారం ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న జాతీయ చేనేత, సిల్క్ ఎగ్జిబిషన్ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న జాతీయ చేనేత, సిల్క్ ఎగ్జిబిషన్కు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. జూన్ 9వ తేదీ వరకు ప్రదర్శన కొనసాగుతుందని, చేనేత రంగాన్ని ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. సుమారు 150 స్టాళ్లను ఏర్పాటు చేశామని, వివిధ రకాల చీరలు, క్రాఫ్ట్ ఐటమ్స్, కొండపల్లి బొమ్మలు, పూసలతో తయారు చేసిన జ్యువెల్లరీలు, పిండి వంటలు వంటివి అందుబాటులో ఉన్నాయని కోట దేవకీదేవి తెలిపారు.