అధికారుల నిర్లక్ష్యం.. కాంట్రాక్టర్ల అనాలోచిత చర్యలతో బంజారాహిల్స్ రోడ్ నం. 5లోని దేవరకొండ బస్తీవాసులు నరకం చూస్తున్నారు. వరద నీటి సమస్యను పరిష్కరించేందుకు బల్దియా రూ. 40 లక్షల వ్యయంతో బాక్స్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టింది. నాలా పనులు చేపట్టాలంటే భారీగా వస్తున్న వరదనీటిని పక్కకు మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది. నాలాకు పక్క నుంచి రోడ్డుపై కాలువ తవ్వాల్సి ఉండగా, రోడ్డుపై నుంచి నీటిని మళ్లించడంతో దేవరకొండబస్తీలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారి మురుగునీటితో నిండిపోవడంతో బస్తీవాసులు అవస్థలుపడుతున్నారు. 10 రోజుల్లో పనులు పూర్తిచేస్తామని మురుగునీటిని రోడ్డుపైకి వదిలిపెట్టిన కాంట్రాక్టర్.. నెలరోజులైనా 10 శాతం పనులూ పూర్తిచేయకపోవడంతో ప్రజలు అవస్థలుపడుతున్నారు.
– బంజారాహిల్స్
బంజారాహిల్స్, ఏప్రిల్ 19: ‘కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది..’ అన్న చందంగా తయారయింది బంజారాహిల్స్ రోడ్ నం. 5లోని దేవరకొండబస్తీవాసుల పరిస్థితి. ఎన్నో ఏండ్లుగా బస్తీని ముంచెత్తుతున్న వరద సమస్యలను పరిష్కరించేందుకు బాక్స్ డ్రెయిన్ నిర్మాణం చేపడితే.. అధికారుల నిర్లక్ష్యానికి తోడు కాంట్రాక్టర్ల అనాలోచిత చర్యల కారణంగా నెలరోజులుగా బస్తీవాసులు ప్రత్యక్ష నరకం చవిచూస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్ నం. 5లోని హనుమాన్ ఆలయం మీదుగా భారీ వరద నీటి కాలువ వర్షాకాలంలో నిండిపోయి ఆలయాన్ని మొత్తం ముంచెత్తుతున్నది. దీంతో పాటు బస్తీలోని నాలాలో పూడిక నిండిపోవడంతో వరదనీటితో దేవరకొండ బస్తీ వాసులు వరదనీటి సమస్యలతో ఇబ్బందులు పడేవారు.
ఈ సమస్యలను పరిష్కరించేందుకు 3 నెలల కిందట రూ.40 లక్షల వ్యయంతో బస్తీలో బాక్స్ డ్రెయిన్ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేపట్టింది. అయితే నాలా పనులు చేపట్టాలంటే భారీగా వస్తున్న వరదనీటిని పక్కకు మళ్లించాల్సిన అవసరం ఏర్పడింది. నాలాను పక్క నుంచి మరల్చి పనులు చేపట్టాలంటూ ప్రస్తుతం ఉన్న నాలాకు పక్క నుంచి రోడ్డుపై కాలువ తవ్వాల్సి ఉండగా, అ పనిచేయకుండా రోడ్డుమీద నుంచి నీటిని మళ్లించడంతో దేవరకొండబస్తీలో రాకపోకలు నిలిచిపోయాయి. రెండునెలలుగా బస్తీ ప్రధాన రహదారి మొత్తం మురుగునీటి ప్రవాహంతో నిండిపోవడంతో బస్తీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
10 రోజుల్లో పనులు పూర్తిచేస్తామని మురుగునీటిని రోడ్డుమీదకు వదిలిపెట్టిన కాంట్రాక్టర్ నెలరోజులు గడిచినా ఇప్పటిదాకా 10 శాతం పనులు కూడా పూర్తిచేయకపోవడంతో స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. 130 మీటర్ల మేర నిర్మించాల్సిన బాక్స్ డ్రెయిన్ పనులు సుమారు 3వేల జనాభా కలిగిన బస్తీకి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. రోడ్డు దాటాలంటేనే వణికే పరిస్థితి నెలకొంది. ఒకవైపు అకాల వర్షాలు ముంచుకొస్తుంటే, దేవరకొండ బస్తీలో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో మురుగునీరు మొత్తం నడిరోడ్డుపై పారుతున్నది. మారుమూల అటవీ ప్రాంతాన్ని తలపించేలా అత్యంత ప్రమాదకరంగా దేవరకొండబస్తీలో రోడ్డు మారడంతో ఏక్షణం ఏ ఉపద్రవం ముంచుకువస్తుందోనని స్థానికులు బెంబేలెత్తుతున్నారు.