బడంగ్పేట, మార్చి11 : పవన్ హత్య చేసిన గౌస్తోపాటు సద్దాం, ఎంజీఎం మీడియా ప్రతినిధి మహుమ్మద్ను అరెస్టు చేసినట్లు మహేశ్వరం జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. శనివారం పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ అంజయ్య, ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వర్రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలానికి చెందిన డేగావత్ పవన్ కుటుంబసభ్యులతో కలిసి పాతబస్తీ వాది యే ఉమర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి ఇంటి పక్కనే ఉంటున్న ఓ యువతితో పవన్కు పరిచయమై ప్రేమగా మారింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి ఇరు కుంటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో యువతి కుటుంబసభ్యులు ఇల్లు ఖాళీ చేసి పహాడీషరీఫ్లో నివాసం ఉంటున్నారు. అయినా ఇద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది.
యువతి బాబాయి గౌస్, సద్దాంలు యువకుడిని హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదు. దీంతో ఈ విషయాన్ని వారు ఎంజీఎం మీడియా ప్రతినిధి మహుమ్మద్కు తెలిపారు. అతను పవన్ కుటుంబసభ్యులను పిలిచి రూ. 5 లక్షలు యువతి కుటుంబసభ్యులకు ఇవ్వాలని బెదిరించాడు. చివరకు రూ. 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే రోజు రాత్రి 12 గంటల సమయంలో పవన్ వాష్రూమ్ కోసం ఇంట్లో నుంచి బయటకు రాడంతో అక్కడే మాటు వేసిన సద్దాం, గౌస్లు అతనిపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. బాలాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి గౌస్, సద్దాంతో పాటు ఎంజీఎం మీడియా ప్రతినిధి మహుమ్మద్ను అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కత్తులను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.