Hyderabad | జీడిమెట్ల, జులై 13: కార్ల లీజు పేరుతో మోసం చేస్తున్న దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. గురువారం బాలానగర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ శ్రీనివాస్ రావు వివరాలను వెల్లడించారు. గాజులరామారం కైసర్నగర్కు చెందిన మహమ్మద్ ఉమర్ (28) ట్రావెల్స్ వ్యాపారి. బల్కంపేట బీకే గూడకు చెందిన నర్సగోని ప్రవీణ్ కుమార్ గౌడ్కు అదే ప్రాంతానికి చెందిన ట్రావెల్స్ వ్యాపారి అహ్మద్ అలీతో పరిచయం ఏర్పడింది. సులువుగా డబ్బులు సంపాదించాలని ఈ ముగ్గురు పథకం వేశారు. నగరంలో డిమాండ్ ఉన్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల పేరుతో దందాకు తెర లేపారు. ఇందుకోసం ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. వ్యక్తిగత వాహనాల యజమానులతో ఒప్పందం చేసుకుని, కారు కండిషన్ , మోడల్ ఆధారంగా ప్రతినెల రూ.30వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. సనత్నగర్, ఎస్ఆర్నగర్, జగద్గిరిగుట్ట, బాచుపల్లి, వనస్థలిపురం పోలీస్స్టేషన్ల పరిధిలో 16 కార్లను అద్దెకు తీసుకున్నారు.
వారికి మూడు నెలల పాటు సక్రమంగా అద్దె చెల్లించారు. ఆ తర్వాత ఆ కార్లపై వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు అప్పు తీసుకుని మార్టిగేజ్ చేసుకున్నారు. నెలలు గడుస్తున్నా కార్ల యజమానులకు అద్దెలు చెల్లించడం లేదు. యజమానులకు అనుమానం వచ్చి కార్యాలయానికి వెళ్లినా , ఫోన్లు చేసినా ఫలితం లభించలేదు. దీంతో ఈ దందాపై బాధితులు ఎస్ఓటీ పోలీసులను ఆశ్రయించారు. మూడు నెలల పాటు వారి కదలికలపై నిఘా పెట్టి ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నారు. ఈ పదహారు అద్దె కార్ల విలువ దాదాపు రూ.కోటి 10 లక్షల వరకు ఉంటుందని డీసీపీ తెలిపారు. ఈ కేసు ఛేదనలో కీలకంగా వ్యవహరించిన ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్ను , సనత్నగర్ ఇన్స్పెక్టర్ బాలారాజును డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో ఎస్ఓటీ అదనపు డీసీపీ శోభన్ , బాలానగర్ ఏసీపీ గంగారం, ఎస్ఓటీ సిబ్బంది పాల్గొన్నారు.