సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఒంటె మాంసాన్ని విక్రయిస్తున్న ముగ్గురిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి నాలుగు ఒంటెలను కూడా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ నితిక పంత్ కథనం ప్రకారం.. బీదర్కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ కొంతకాలం కబేళాలో పనిచేశాడు. ఆ తరువాత హైదరాబాద్కు వచ్చి టోలిచౌకి, పారామౌంట్ కాలనీలోని గేట్ నం.2 వద్ద బెస్ట్ బీఫ్ షాప్ పేరుతో బీఫ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహ్మద్ సల్మాన్, సిరాజ్ ఖాన్తో కలిసి ఒంటెలు తెచ్చి, వాటి మాంసాన్ని విక్రయించేందుకు పథకం చేశారు.
ఇందులో భాగంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శ్యామ్ అనే వ్యక్తిని సంప్రదించారు. అతడి వద్ద 7 ఒంటెలు కొనుగోలు చేసి, హైదరాబాద్కు తరలించారు. ఒక్కో ఒంటెను కోస్తూ.. కిలో మాంసం రూ.400 చొప్పున విక్రయిస్తున్నారు. మూడు ఒంటెలను వధించారు. మిగతా నాలుగు ఒంటెలను కూడా వధించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్రమంగా ఒంటె మాంసాన్ని విక్రయిస్తున్నరనే సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్రెడ్డి బృందం దాడిచేసింది. నిందితుల వద్ద నుంచి నాలుగు ఒంటెలు, మాంసం బరువు చూసేందుకు ఉపయోగిస్తున్న మిషన్లు, ఒంటెలను కోసేందుకు ఉపయోగించిన కత్తులు.. తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఫిలింనగర్ పోలీసులకు అప్పగించారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.