పహాడీషరీఫ్, జూన్ 6: పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో గతనెలలో జరిగిన పూరన్ సింగ్ హత్య కేసు మిస్టరీ వీడింది. నిందితులను అరెస్టు చేశారు. వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగినట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహేశ్వరం ఏసీపీ అంజయ్య, ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్, ఎస్సైలు మధుసూదన్, నయీమొద్దీన్ వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన పూరన్ సింగ్ కుటుంబం బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వచ్చి స్థిరపడింది. బండ్లగూడ, పటేల్నగర్లో పానీపూరి బండి నడిపించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా, స్థానికులు అందించిన సమాచారంతో గతనెల 25వ తేదీన గుర్తు తెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని తుక్కుగూడ సూరం చెరువులోనుంచి పోలీసులు స్వాధీనం చేసుకొని.. ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ సమాచారాన్ని పోలీసులు సమీప అన్ని పోలీసు స్టేషన్లకు చేరవేశారు. ఇదిలా ఉండగా.. పూరన్సింగ్ కనిపించకపోవడంతో గతనెల 22వ తేదీన అతడి భార్య మమత చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా చెరువులో లభించిన మృతదేహం పూరన్ సింగుదని మమత గుర్తించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో పూరన్ సింగ్ హత్యకు గురైనట్టు భావించిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
వివాహేతర సంబంధమే…
పూరన్ సింగ్కు ఉత్తరప్రదేశ్కు చెందిన జయదేవి దగ్గరి బంధువు. అతడు ఉత్తరప్రదేశ్లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. కొన్ని కారణాల వల్ల పూరన్ సింగ్ వివాహం హైదరాబాద్కు చెందిన మమతతో జరిగింది. జయదేవికి మరొకరితో వివాహం జరిగింది. జయదేవి కూడా హైదరాబాద్కు వచ్చి నివాసముంటుంది. ఈ క్రమంలో పూరన్ సింగ్, జయదేవి మధ్య వివాహేతర సంబంధం కొనసాగింది. ఇదిలాఉండగా.. జయదేవి చాంద్రాయణగుట్టలోని బండ్లగూడకు చెందిన నజీం (31)తో కూడా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.
పెండ్లి చేసుకోలేదన్న కోపంతో..
అయితే, తనను పెండ్లి చేసుకోలేదన్న కోపంతో ఉన్న జయదేవి, తనకు అడ్డుగా ఉన్నాడన్న కోపంతో నజీం కలిసి పూరన్సింగ్ను హతమార్చేందుకు పథకం వేశారు. ఇందుకు కాటేదాన్లో ఉంటున్న స్నేహితులు సుగుణారామ్, ముదీన్, అంజాద్ సహాయాన్ని నజీం తీసుకున్నాడు. వీరంతా కలిసి పూరన్సింగ్ను హత్య చేసేందుకు పథకం రచించి, ప్రత్యేకంగా తుక్కుగూడలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. హత్య కోసం మటన్ కట్ చేసి కత్తిని కూడా కొనుగోలు చేశారు. ఈ పథకంలో భాగంగా గతనెల 22వ తేదీన పూరన్సింగ్ను తుక్కుగూడకు రప్పించారు. జయదేవి అతడిని తుక్కుగూడలోని గదికి తీసుకువెళ్లింది. స్కెచ్లో భాగంగా ఐదుగురు నిందితులు కలిసి అదేరోజు రాత్రి కత్తితో గొంతుకోసి, ఆ తర్వాత ఛాతిలో పొడిచి పూరన్ సింగ్ను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కి.. జేసీబీ సహాయంతో ఆ డ్రమ్మును నజీం సూరం చెరువుకు తరలించి పడవేశారు. మరుసటి రోజు నిందితులంతా పారిపోయారు. కాగా, చెరువులో లభించిన మృతదేహం పూరన్ సింగుదిగా గుర్తించిన పోలీసులు.. అతడి భార్య చేసిన ఫిర్యాదుతో హత్యగా నిర్ధారించి దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీంచారు. ఈ క్రమంలో నజీం, సుగుణా రామ్ను గుర్తించిన పోలీసులు వారిపై నిఘా పెంచారు. ఈ క్రమంలో నిందితులిద్దరూ తుక్కుగూడలో ఉన్న సామగ్రి తీసుకువెళ్లేందుకు గదికి రాగా.. నిఘా పెట్టిన పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా హత్యకు సంబంధించిన వివరాలు వెలుగుచూశాయి. నిందితులిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు.. వారివద్ద నుంచి జేసీబీ, కత్తి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిని రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు జయదేవి, ముదీన్, అంజాద్ కోసం గాలిస్తున్నారు. ఈ కేసు మిస్టరీ ఛేదించడంలో ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథ్కు, ఎస్సైలు మధుసూదన్, నయీమొద్దీన్, అజయ్కుమార్, వెంకటయ్యకు సహకరించిన కానిస్టేబుళ్లను ఏసీపీ అంజయ్య అభినందించి, రివార్డులను అందజేశారు.