మియాపూర్ ,నవంబర్ 26 :ఒక్కగానొక్క కొడుకు… కనిపించకుండాపోవడంతో ఆ తల్లిదండ్రుల మనసు తల్లిడిల్లిపోతున్నది. ‘కొడుకా.. ఎక్కడున్నావ్’.. అంటూ బరువెక్కిన హృదయంతో రెండున్నరేండ్లుగా ఎదురు చూస్తున్నారు.. అదృశ్యమైన కుమారుడి జాడ తెలుసుకునేందుకు తమకు సాయం చేయాలని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గాంధీని కలిసి చమర్చిన కండ్లతో తమ గోడు వెళ్లబోసుకున్నారు.
జూలై 3.. 2019 మియాపూర్ కృష్ణసాయి ఎన్క్లేవ్లో క్రొవ్విడి నర్సింహారావు, నాగలక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. నర్సింహారావు ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలో సీనియర్ సైంటిస్ట్గా పని చేశారు. వీరి కుమారుడు బ్రహ్మానందం(22) బీటెక్ పూర్తి చేశాడు. 2019లో మే లో విప్రోలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. జూలై 3న నర్సింహారావు కొడుకును ఆఫీస్ వద్ద స్వయంగా దింపి వచ్చాడు. అదే రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు తల్లి కుమారుడికి ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆ రోజు రాత్రి వరకు కుమారుడు ఇంటికి రాకపోవడంతో వెంటనే వారు ఆఫీస్కు వెళ్లి విచారించారు. మధ్యాహ్నం 12.35 గంటలకు కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు ఎమ్మెల్యేకు తెలిపారు. ఓ రెడ్ కలర్ కారులో బ్రహ్మానందం వెళ్లినట్లు కెమెరాలో నమోదైందన్నారు. తోటి స్నేహితులు, చుట్టు పక్కల విచారించినా.. ఫలితం లేకపోవడంతో గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేయగా…ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు.
ఇప్పటివరకు జాడ తెలియలేదు..
‘ఎఫ్ఐఆర్ నమోదై రెండున్నరేండ్లు గడిచినా.. ఇప్పటి వరకు మా కుమారుడు బ్రహ్మానందం జాడ తెలియలేదు. అప్పటి నుంచి సమాచారం కోసం ప్రతి శనివారం గచ్చిబౌలి పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం’ అని చెప్పారు. నాటి సీపీ సజ్జనార్ను, ప్రస్తుత సీపీ స్టీఫెన్ రవీంద్రలను కలిసినట్లు పేర్కొన్నారు. కుమారుడి ఆచూకీ కోసం అతడి ఫొటోతో ముద్రించిన పోస్టర్లు పంచుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇద్దరి సంతానంలో చిన్నవాడు ఏడో ఏటనే మృతి చెందాడని, ఉన్న ఒక్క కుమారుడు కూడా కనిపించకుండా పోయాడని, దీంతో తాము జీవచ్ఛవాల్లా బతుకుతున్నామని, తమకు సాయం చేయాలని నర్సింహారావు దంపతులు ఎమ్మెల్యే గాంధీని వేడుకున్నారు. ఇందుకు స్పందించిన ఆయన తప్పకుండా సాయం చేస్తానని ..అధైర్యపడొద్దని బాధిత దంపతులకు భరోసా ఇచ్చారు.