బంజారాహిల్స్, ఏప్రిల్ 13 : సంప్లో మోటర్ పనిచేయకపోవడంతో బకెట్తో నీళ్లు తోడుకునేందుకు వెళ్లిన యువకుడితో పాటు అతడిని కాపాడే క్రమంలో మరో ఇద్దరు యువకులు విద్యుత్ షాక్తో మృతిచెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. పారామౌంట్ కాలనీ ముక్తార్ మంజిల్ అపార్ట్మెంట్లోని మొదటి ఫ్లోర్లో నివాసముంటున్న మహ్మద్ రిజ్వాన్ (18) ఇంటర్ చదువుతుండగా అతడి తమ్ముడు మహ్మద్ రజాక్(16) ఇటీవలె పదవ తరగతి పరీక్షలు రాశాడు. రజాక్ స్నేహితుడు అనీసుద్దీన్ హుస్సేన్ (20) అదే ప్రాంతంలో నివాసముంటున్నాడు. అదే భవనం సెల్లార్ సంపులోని మోటార్ రెండ్రోజులుగా పనిచేయడం లేదు. మోటార్కు మరమ్మతు చేయాల్సి ఉందని, షార్ట్ సర్క్యూట్ అయినట్లు వాచ్మన్ రాజయ్య అపార్ట్మెంట్ నిర్వాహకులకు చెప్పాడు.
దాన్ని బాగు చేసేందుకు మోటార్ మెకానిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి రిజ్వాన్, రజాక్తో పాటు స్నేహితుడు అనీసుద్దీన్ ఇంట్లో ఉన్నారు. బాత్రూమ్లో నీళ్లు లేకపోవడంతో కింద ఉన్న సంప్లో నుంచి బకెట్తో నీళ్లు తెచ్చేందుకు రజాక్ కిందకు వచ్చాడు. అయితే షార్ట్ సర్క్యూట్ అయిన విషయం తెలియని రజాక్ మోటార్ ఆన్ చేసి చూశాడు. నీళ్లు వస్తున్నాయా లేవా అని మొదటి ఫ్లోర్లో ఉన్న సోదరుడిని అడిగాడు. నీళ్లు రావడం లేదని చెప్పగా మోటార్ స్విచ్ ఆఫ్ చేయకుండా సంప్లో నుంచి నీళ్లు తీసుకునేందుకు ప్రయత్నించగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతసేపటికీ తమ్ముడు రాకపోవడంతో అక్కడకు వచ్చిన రిజ్వాన్ నీటిలో పడిపోయిన తమ్ముడిని కాపాడేందుకు సంప్లోకి దిగాడు. అతడు కూడా కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. స్నేహితులిద్దరూ రాకపోవడంతో కిందకు వచ్చిన అనీసుద్దీన్ కూడా సంప్ వద్దకు వచ్చి నీటిలో దిగడంతో కరెంట్ షాక్ తగిలి దుర్మరణం చెందాడు.
అరగంట తర్వాత కొడుకులను వెతుక్కుంటూ వచ్చిన కుటుంబ సభ్యులకు సంప్లో ముగ్గురి మృతదేహాలు కనిపించాయి. దీంతో గట్టిగా కేకలు వేయడంతో అదే భవనంలో పెంట్ హౌజ్లో ఉంటున్న వాచ్మన్ రాజయ్యతో పాటు స్థానికులు అక్కడకు చేరుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను వెలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మోటార్ షార్ట్ సర్క్యూట్ కావడంతో సంపులోని నీటిలో కరెంట్ ప్రవహిస్తున్న విషయం తెలియకపోవడంతో ముగ్గురు యువకులు మృతి చెందినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.