మణికొండ : ప్రజాసంక్షేమం,మున్సిపాలిటీల సంపూర్ణ అభివృద్ది కోసం తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యులు టి.ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలో గురువారం మున్సిపాలిటీ, వివిధ బ్యాంకుల సహకారంతో మంజూరైన 25 ‘డ్రైవర్ కం ఓనర్’ చెత్త తరలింపు వాహనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రారంభించారు.
అంతకు ముందు శివపురికాలనీలో సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ల్యాంకోహిల్స్ సమీపంలోని క్రికెట్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 25 చెత్త సేకరణ ఆటోలకు పచ్చజెండా ఊపి ప్రారంభించి డ్రైవర్లకు బ్యాంకు, మున్సిపాలిటీ అధికారులతో కలిసి తాళాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ మాట్లాడారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్నివర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. శివారు మున్సిపాలిటీల అభివృద్ది కోసం రాష్ట్ర పట్టణాభివృద్ది, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవచూపుతున్నారని గుర్తుచేశారు. ఇప్పటికే మున్సిపాలిటీలలో శాశ్వత తాగునీటి సమస్యల పరిష్కారం కోసం నిధులను కేటాయించారన్నారు.
మణికొండలో ఇటీవల రూ.517కోట్ల నిధులతో శాశ్వత తాగునీటి సరఫరా చర్యల్లో భాగంగా మొదటివిడత పనులకు శంఖుస్థాపన చేసిన విషయం తెలిసిందేనన్నారు. మున్సిపాలిటీలలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న మణికొండను అన్నిరంగాలల్లో అభివృద్ది పర్చేందుకు తనవంతుగా కృషిచేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు.
స్వచ్ఛ సర్వేక్షణలో మణికొండ మున్సిపాలిటీని ఆదర్శనీయంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కె.నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ప్లోర్లీడర్ కె.రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమీషనర్ ఫల్గుణ్కుమార్, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.