బడంగ్పేట, డిసెంబర్ 14: విజ్ఞాన శాస్త్ర ఫలాలు ప్రతి ఒక్కరికీ అందినప్పుడే దాని ప్రయోజనం నెరవేరుతుందని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. రంగారెడ్డి జిల్లాస్థాయి 50వ సైన్స్, మ్యాథమెటిక్స్, పర్యావరణ, ఇన్స్పైర్ ప్రదర్శనను బుధవారం ఆయన నాదర్గూల్లోని వంశీధర్ స్కూల్లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వంశీధర్ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన స్వాగత నృత్య ప్రదర్శన, చదువు ప్రాముఖ్యతను తెలుపుతూ హయత్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులచే ప్రదర్శింపబడిన నృత్యాలు ఎంతగానో అలరించాయి. రంగారెడ్డి జిల్లా ఎన్సీసీ క్యాడెట్స్ యూనిట్ ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు.
అనంతరం సైన్స్ ప్రదర్శనను పరిశీలించారు. వ్యవసాయ పరికరాలు, ప్రథమ చికిత్స, ఆలో మీటర్, స్మార్ట్ కాలనీ వంటి ప్రాజెక్టుల నమూనాలను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆధునీకరణను సంతరించుకుని తమ ప్రతిభను కనబర్చాలన్నారు. భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదగాలని సూచించారు. మన ఇల్లు ఒక విజ్ఞాన ప్రయోగశాల వంటిదని, అక్కడి నుంచే ఆవిష్కరణలు ప్రారంభమవుతాయని అన్నారు. విశ్లేషణాత్మక ఆలోచనలు బాల్యదశ నుంచే అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. చుట్టూ ఉన్న సమస్యను ఎలా పరిష్కరించాలో తెలుసుకోవాలన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలంటే విద్యార్థులు సైంటిస్టులుగా ఎదిగినప్పుడే సాధ్యమవుతుందని అన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ జనార్దన్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల సృజనాత్మకతను ఉపాధ్యాయులు వెలికితీసి భావి శాస్త్రవేత్తలుగా తీర్చి దిద్దాలన్నారు. ఉన్న వనరులను కాపాడుకుంటూ మానవజాతి ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కార దిశగా బాల మేథావులచే తయారు చేయాలన్నారు. వారి నూతన ఆలోచనలు ఎంతగానో ఉపాయోగపడుతాయని ఆకాంక్షించారు. చరిత్రలో చిరస్థాయిలుగా నిలువాలంటే శాస్త్రవేత్తలుగా తయారు కావాలన్నారు. ఈ ప్రదర్శనలో గణిత, వైజ్ఞానిక పర్యావరణ ప్రాజెక్టులు 285తో పాటు, ఇన్స్పైర్ ప్రదర్శనలు 93 పాలు పంచుకున్నాయని జిల్లా సైన్స్ అధికారి వై. శ్రీనివాస్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలల సైన్స్ కో ఆర్డినేటర్ రాజిరెడ్డి, డీసీఈబీ సెక్రటరీ రామచంద్రా రెడ్డి, డీఈఓ సుశీందర్రావు, ఎంఈవో కృష్ణయ్య, బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, కార్పొరేటర్ సునీతా శ్రీకాంత్గౌడ్, వంశీధర్ పాఠశాల చైర్మన్ కంకణాల కృష్ణారెడ్డి, పాఠశాల డీన్ గోదా లక్ష్మి, అకడమిక్ ఇన్చార్జి మధు, ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.