అంబర్పేట, జనవరి 27: బాగ్అంబర్పేట డివిజన్లోని శ్రీనివాసనగర్ కాలనీలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ భవనం దాదాపు పూర్తయ్యింది. ఆరు నెలల క్రితం కాలనీవాసుల కోరిక మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ చొరవ తీసుకొని రెండంతస్తుల మల్టీపర్పస్ భవనానికి శంకుస్థాపన చేశారు. అందుకోసం రూ.40లక్షల నిధులను మంజూరు చేయించారు. అప్పటి నుంచి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు ముగింపు దశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పనుల పురోగతిని సంబంధిత అధికారులు, కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. భవనాన్ని సమగ్రంగా అన్ని వసతులతో పూర్తి చేయాలని చెప్పారు. ఎలాంటి సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయాలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు చెప్పారు. మరో రూ.40 లక్షలు ఎమ్మెల్యే నియోజకవర్గం నిధుల నుంచి కేటాయిస్తానన్నారు. ఇప్పటికే పూర్తయిన రెండు అంతస్తుల మల్టీపర్పస్ భవనాన్ని సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అప్పటి వరకు అన్ని వసతులు కల్పిస్తామన్నారు.