బంజారాహిల్స్ : బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా, కేబీఆర్ పార్కు సమీపంలో ఫుట్పాత్లపై తిష్టవేసి రోగుల సహాయకులు, స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్న యాచకులను, నిరాశ్రయులను బంజారాహిల్స్ పోలీసులు సోమవారం జీహెచ్ఎంసీ రెస్క్యూ హోమ్లకు తరలించారు.
వివిధ ప్రాంతాలనుంచి చికిత్స కోసం క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చేరోగుల వెంబడి వచ్చే సహాయకులు ఫుట్పాత్లపై ఒకటిరెండు రోజులు ఉంటారు. వారికి సాయం చేసేందుకు కొంతమంది దాతలు ఆహారాన్ని తీసుకువచ్చి అందిస్తుంటారు.
అయితే కొంతమంది యాచకులతో పాటు తాగుబోతులు, సోమరిపోతులు క్యాన్సర్ ఆస్పత్రి ముందు ఫుట్పాత్పై తిష్టవేసి అక్కడకు వచ్చే రోగుల సహాయకులతో గొడవలకు దిగడంతో పాటు రాత్రిపూట మద్యం సేవించి న్యూసెన్స్లకు పాల్పడుతున్నారు. దాడులకు సైతం ఎగబడుతున్నారు. వీరి వ్యవహారం శృతిమించడంతో పలువురు వాకర్లు, దాతలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో సోమవారం బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ శివచంద్ర ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని యాచకులను జీహెచ్ ఎంసీ రెస్క్యూహోంకు తరలించారు. కేవలం రోగులు, వారి సహాయకులు మాత్రమే ఇక్కడ ఉండేందుకు అవకాశం కల్పిస్తామని పోలీసులు తెలిపారు.