దుండిగల్, జూన్ 9: నిజాంపేట్ సర్కిల్ పరిధి, బాచుపల్లిలోని సర్వే నంబర్ 186లో ఉన్న చెత్త డంపింగ్ కేంద్రాన్ని నెలరోజుల్లో వేరే ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డు విషయమై స్థానిక డబుల్ బెడ్రూం ఇండ్ల వాసులు, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, జర్నలిస్టు కాలనీతో పాటు పరిసర కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజల నుంచి ఫిర్యాదులు అందిన నేపథ్యంలో మంగళవారం ఆయన నిజాంపేటలో పర్యటించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న బాలికల గురుకుల సంక్షేమ పాఠశాల, డిగ్రీ కళాశాలను అడ్లూరి పరిశీలించారు.
ఈ సందర్భంగా పక్కనే ఉన్న డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధ్దిదారులు చెత్త డంపింగ్ కేంద్రం వలన కలుగుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సృజనకు ఫోన్ చేసిన మంత్రి నెల రోజుల్లోగా చెత్తడంపింగ్ కేంద్రాన్ని అక్కడ నుంచి తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనుచౌదరి, బాచుపల్లి తహసీల్దార్ వాణిరెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిఫ్యూటీ కమిషనర్ సాబెర్ ఆలీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలన్ హన్మంత్రెడ్డి, సీనియర్ నాయకులు కొలన్ శ్రీనివాస్రెడ్డి, సంక్షేమ సంఘం ప్రతినిధులు అస్కాని మారుతీసాగర్, తన్నీరు శ్రీనివాస్, కొలెపాక వెంకట్, లింగస్వామి, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ ప్రతినిధులు వెంకట్, రామరాజు, సుదర్శన్రెడ్డి, భాస్కర్రావు, కోక మధు పాల్గొన్నారు.