సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలో సామాన్యుడికి సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణమే కరువైంది. అధునాతన రవాణా వ్యవస్తకు చిరునామాగా మారిన మెట్రో రైలుపై ప్రస్తుత సర్కారు గోరుచుట్టుపై రోకలిపోటులా వ్యవహారిస్తోంది. గత ప్రభుత్వం మెట్రో రెండో దశను పరుగులు పెట్టించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తే, ప్రస్తుత పాలకులు మాత్రం దాని మూలనపడేసింది. ముఖ్యంగా మెట్రోలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, అదనపు బోగీలను సమకూర్చాల్సిన బాధ్యతను విస్మరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రైలు ఎక్కాలంటే..
నగరంలో మెట్రో ప్రయాణం ఇప్పుడు నరకప్రాయంగా మారింది. ఉదయం, సాయంత్రం వేళల్లో రైలు ఎక్కాలంటే యుద్ధం చేయాల్సి వస్తోంది. మూడు బోగీల రైళ్లు ప్రయాణికుల రద్దీకి ఏమాత్రం సరిపోవడం లేదు. కనీసం ఐదు నిమిషాలకు ఒక రైలు కూడా రాని పరిస్థితి నెలకొంది. గతంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బోగీల సంఖ్యను పెంచాలని, అదనపు కోచ్లను కొనుగోలు చేయాలని నిర్వహణ సంస్థకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలివ్వలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. సర్కార్ తీరుతో కొత్త బోగీల కొనుగోలు ప్రక్రియ పూర్తిగా సందిగ్ధంలో పడింది.
నిధులకు దిక్కు లేదు..
మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వమే పూర్తిగా స్వాధీనం చేసకుంటామని చెబుతోంది. అయితే ఇప్పటివరకు నిధుల సర్దుబాటుపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో కొత్త బోగీల అంశంలో అటు సర్కార్ గానీ, ఇటు నిర్వహణ సంస్థగానీ ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. కొత్త బోగీలకు సంబంధించి ఆర్డర్లు ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతులు అనివార్యం కావడంతో, సర్కార్ మాత్రం కొత్త మార్గాల రీ సర్వేలు, నిధుల సర్దుబాటు, అనుమతుల పేరిట అసలు విషయాన్ని పక్కనపెట్టి.. ప్రయాణికులను మెరుగైన రవాణా సేవలను దూరం చేస్తోంది. అదనపు బోగీలకు నిధులు లేకపోవడంతోనే ఈ అంశంలో నిర్వహణ సంస్థ ముందుకు పోవడం లేదనీ మెట్రో వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే కిక్కిరిసిన ప్రయాణ ఇబ్బందులతో నగర వాసులు మెట్రోకు క్రమంగా దూరం అవుతున్నారు. కనీసం అదనపు బోగీలను ఏర్పాటు చేస్తే మెరుగైన సేవల కోసమైన ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.
అడ్డుకుంటున్న ప్రభుత్వ చర్యలు
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకున్నది. ఓ వైపు మెట్రో స్వాధీనం పేరిట సర్కారు సృష్టించిన గందరగోళం, మరోవైపు నిధుల్లేక నిలిచిన ప్రక్రియ, అదనపు బోగీల విషయంలో సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహారిస్తోంది. కొత్త బోగీల కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకుండా, మెట్రోను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా సర్కారు మొండి వైఖరి వీడి, అదనపు బోగీల కొనుగోళ్లకు పచ్చజెండా ఊపి, మెట్రో ప్రయాణాన్ని సుఖమయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు.