కేంద్ర బడ్జెట్లో నగరానికి శూన్యహస్తం
పైసా కేటాయించని మోదీ సర్కారు
అభివృద్ధి పనులకు ఊతమివ్వని వైనం
రాష్ట్ర ప్రతిపాదనలు బుట్టదాఖలు
ఊసేలేని స్కైవేలు, లింకురోడ్ల
నిర్మాణం, మూసీ ప్రక్షాళన
దశ, దిశ, పసలేని పద్దు అని ఆగ్రహం
సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ) ;నగరవాసుల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. కేంద్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి పైసా కేటాయించలేదు. పరుగులు పెడుతున్న వివిధ పనులకు ఊతమివ్వాలని రాష్ట్రం అనేక ప్రతిపాదనలు పంపినా అన్నింటినీ బుట్టదాఖలు చేసి రిక్తహస్తం చూపించింది. రాష్ట్రంపై ఉన్న అక్కసును కేంద్రం మరోసారి వెల్లగక్కినట్లు రుజువైంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ దశ, దిశ, నిర్దేశం, పసలేని బడ్జెట్ అని నగరవాసులు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. స్కైవేలు, శివార్లలో లింకు రోడ్ల నిర్మాణం, మూసీ ప్రక్షాళన, ఎస్టీపీల నిర్మాణానికి తోడ్పాటు, ఐటీఐఆర్ ఏర్పాటుకు సహకారమివ్వాలని స్వయంగా పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినా పైసా విదల్చలేదు. మొత్తం రూ.34,500 కోట్ల ప్రతిపాదనలు సమర్పించగా, చివరకు గుండు సున్నా చూపించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రేటర్ వాసులంతా ఎంతో ఆసక్తిగాఎదురు చూసిన కేంద్ర బడ్జెట్ ఊరించి ఊసురుమనిపించింది. పార్లమెంట్లో మంగళవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసింది. దశ, దిశ, పసలేని, నిష్ప్రయోజనమైన బడ్జెట్గా నగరవాసులు, ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా అభివర్ణించారు. ఆదాయపు పన్ను శ్లాబులు మార్చకపోవడం, ప్రజల ఆరోగ్యాన్ని గాలికివదిలేశారని మండిపడ్డారు. మధ్యతరగతి ప్రజలకు అసంతృప్తి కలిగే విధంగా ఉందని విమర్శించారు.
శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రతిపాదిత ప్రాజెక్టులకు కేంద్రం మూడో వంతు భరించేలా నిధులు కేటాయించాలని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు బీజేపీ ప్రభుత్వానికి పలుమార్లు లేఖల ద్వారా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో చేపట్టిన లింక్ రోడ్ల నిర్మాణానికి రూ.2,400 కోట్లు, నగర శివారు, నగరం నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు రవాణా సదుపాయాలను మెరుగుపర్చడానికి 104 అదనపు కారిడార్లను గుర్తించామని, ఈ రోడ్ల కనెక్టివిటీ ద్వారా అర్బన్ రోడ్ల కనెక్టివిటీకి రూ.11,500 కోట్లతో మూసీ నదిపై స్కైవే, నదికి ఇరువైపులా 16 కిలోమీటర్ల గ్రేడ్ సెపరేటర్లను నిర్మాణం, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణాలకు అయ్యే వ్యయం రూ.8684.54 కోట్లలో కేంద్రం మూడో వంతు భరించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. దాదాపు రూ.34,500 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినా ఒక్క ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. ఇక మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు కేంద్రం నిధులు కేటాయిస్తారని ఆశించినా నిధులు మంజూరు చేయలేదు. నమో గంగామి కింద నదుల ప్రక్షాళనకు నిధులన్నీ గంగ పాలు చేసిన కేంద్రం ..తాజా బడ్జెట్లో పరివాహాక ప్రాంతాలలో నిధుల కేటాయింపు అంటూ ప్రకటించడంపై విస్మయానికి గురి చేస్తుందంటూ పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
నిరాశలో వేతన జీవులు
ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులుంటాయని ఆశించిన వేతన జీవులకు ఈ బడ్జెట్లో నిరాశే ఎదురయ్యింది. ఐటీ స్లాబుల్లో కేంద్రం ఎటువంటి మార్పులు సూచించలేదు. వ్యక్తిగతంగా సమర్పించే ఐటీ రిటర్న్ల్లో తగిన సవరణలు చేసుకోవడానికి రెండేండ్ల వెసులుబాటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు కూడా నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద 14 శాతం మేర ఐటీ పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
చిక్కడపల్లి, ఫిబ్రవరి1 : కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ, సబ్సిడీల కోతలకు నిరసనగా మంగళవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి.వెంకట్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్వి టి.సాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సాయిబాబులు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ బడ్జెట్ 3.14 శాతం మాత్రమే కేటాయించడం దారుణం అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శులు భాస్కర్, వెంకటేశ్, రమ, వివిధ సంఘాల నాయకులు వెంకట్రాములు, శ్రీకాంత్, శోభన్, ప్రసాద్, ఆశయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
‘సాఫ్ట్వేర్’ ఊసే లేదు..
ప్రస్తుతం భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన మరియు విక్రయించబడే అన్ని సాఫ్ట్వేర్ ఉత్పత్తులపై పూర్తి ఇన్పుట్ పన్ను క్రెడిట్తో కూడిన జీఎస్టీ 18% ఉంది. దానిని భారతదేశంలోని సాఫ్ట్ వేర్ కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి ఈ రేటును తగ్గించాలని ఆశించాం. కానీ దాని ప్రస్తావన ఈ బడ్జెట్లో ఏం లేదు.-పాటిమీది జగన్మోహన్ రావు, చైర్మన్,తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్
అసత్యాలు, అంకెల గారడీ..
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దశ, దిశా లేని బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు నిరాశను మిగిల్చింది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో అన్ని అసత్యాలు, అంకెల గారడీ తప్ప ఏ వర్గానికి మేలు చేసేలా కేటాయింపులు చేయలేదు. నూతన బడ్జెట్లో కేటాయింపులు పెంచకపోగా గతంలో ఉన్న వాటిలో కోతలు విధించడం దుర్మార్గం.-తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
నిరుత్సాహంగా ఉంది
ఐటీ ఉద్యోగులు కేంద్ర బడ్జెట్ నుంచి ఆశించి ఒక్కటే… ఆదాయ పన్ను పరిమితిని పెంచాలని కోరుకుంటారు. ప్రతియేటా ప్రవేశపెట్టే బడ్జెట్లో ఇదే అంశంపై ఐటీ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. వారిని కేంద్రం కనికరించడం లేదు. చాలా నిరుత్సాహంగా ఉంది.-గణేశ్, ఐటీ ఉద్యోగి.