సిటీబ్యూరో: కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా చెత్త నిర్వహణను డిజిటల్ ట్రాకింగ్ ద్వారా మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. దాని ద్వారా ప్రజలు చెత్త నిర్వహణను నిబంధనలకు అనుగుణంగా చేపడుతున్నారా? ఇష్టానుసారంగా బహిరంగ ప్రదేశాల్లో పడేస్తున్నారా? తడి, పొడి, బయో వ్యర్థాలను వేరు చేస్తున్నారా? లేదా? వంటి వివరాలను డిజిటల్ ట్రాకింగ్ ద్వారా గుర్తించి, నిబంధనలు పాటించని వారికి జరిమానాలు విధిస్తారు. అలాగే చెత్త ఉత్పత్తి నుంచి నిర్వహణ దాకా అన్ని దశలను పర్యవేక్షిస్తారు.
అలాగే నూతన మార్గదర్శకాల ప్రకారం తడి, పొడి, పారిశుధ్య, ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వ్యర్థాల పేరిట నాలుగు రకాలుగా విభజించారు. తడి చెత్త కింద వంటగది, సేంద్రియ వ్యర్థాలు వీటిని డంపింగ్ యార్డులకు తరలించాలి. పొడి వ్యర్థాల కింద ప్లాస్టిక్, కాగితం, లోహం, గాజు పదార్థాలు ఉంటాయి. వీటిని రీసైక్లింగ్ కోసం మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్కు పంపాలి. పారిశుధ్య వ్యర్థాల కింద వాడిన డైపర్లు, శానిటరీ ఉత్పత్తులు ఉంటాయి. వీటిని భద్రంగా చుట్టి నిల్వచేయాలి. ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వ్యర్థాలైన బల్బులు, పెయింట్ డబ్బాలు, బ్యాటరీలు, గడువు ముగిసిన మందులను సంబంధిత ఏజెన్సీలకు అప్పగించాల్సి ఉంటుంది.