సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : భారతదేశంలోనే అతి పెద్ద కార్యక్రమంగా మేకర్స్ ఫెయిర్ హైదరాబాద్ను ప్రతి యేటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ వర్క్స్ వేదికగా శనివారం నుంచి మేకర్స్ ఫెయిర్ హైదరాబాద్ వందలాది మంది ఔత్సాహికులతో సందడిగా ప్రారంభమైంది.
కొత్త వస్తువులను తయారు చేయాలన్న ఆసక్తి ఉన్న వారందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారు తయారు చేసిన వస్తువులు ఆదరణ చూరగొనేలా చేయడమే లక్ష్యంగా మేకర్స్ ఫెయిర్ను నగరంలో నిర్వహిస్తున్నారు. దేశంలోని మేకర్స్ కమ్యూనిటీ అంతా ఇందులో పాల్గొనేలా టీ వర్క్స్ చర్యలు చేపట్టింది. దేశంలోనే అతి పెద్ద హార్డ్వేర్ ప్రొటో టైపింగ్ సెంటర్గా ఉన్న టీ వర్క్స్లో తయారీ దారులకు అవసరమైన అత్యాధునిక యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచారు.
వివిధ అంశాల్లో కొత్తగా వస్తువులను రూపొందించేందుకు వందలాది మంది ఔత్సాహికులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి టీ వర్క్స్కు తరలివచ్చారని టీ వర్క్స్ ప్రతినిధి వీర తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో సైన్స్, ఆర్ట్, టెక్, ఫుడ్, డ్రోన్స్, మ్యూజిక్, డూ ఇట్ యువర్ సెల్ఫ్(డిఐవై) వంటి అంశాల్లో ఔత్సాహికులు వస్తువులను తయారు చేసి ప్రదర్శిస్తారని తెలిపారు.
కొత్త ఆలోచనలతో వచ్చి, వస్తువు నమూనాను రూపొందించుకొని వెళ్లేందుకు అవసరమైన మౌలిక వసతులు, యంత్ర పరికరాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. మొదటి రోజు 500 మందికి పైగా తయారీదారులు పాల్గొని, 80కిపైగా వర్క్షాపులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన డ్రోన్ రేసింగ్ను అందరినీ ఎంతో ఆకట్టుకుందని టీ వర్క్స్ ప్రతినిధి వీర వివరించారు.