నగరంలో స్వచ్ఛత గాడి తప్పింది.. ఎక్కడ చూసినా.. చెత్త కుప్పలే దర్శమిస్తున్నాయి.. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో కాలనీలు, బస్తీలు డంపింగ్ యార్డులను తలపిస్తూ..
కంపుకొడుతున్నాయి. దుర్వాసన, రోగాలతో జనం అవస్థలుపడుతున్నారు. ఎన్ని స్పెషల్ డ్రైవ్లు చేపట్టినా.. కాగితాల్లో ఎన్ని జీవీపీ పాయింట్లు ఎత్తివేసినట్లు చూపుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఎకడ వేసిన గొంగళి అకడే అన్నట్లు ఉంది. చెత్తశుద్ధిలో చిత్తశుద్ధి కరువుతున్నది. ఫలితంగా రోగాలు విజృంభిస్తున్నాయి.
సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) : తడి, పొడి చెత్త సేకరణ, తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) ఎత్తివేతలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక మెగా స్పెషల్ డ్రైవ్ సైతం ఫలితాలు ఇవ్వడం లేదు. ఈ క్రమంలోనే పారిశుధ్య నిర్వహణ లోపంతో కాలనీల్లో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. మురుగు కాలువలు పూడిక తీయకపోవడం, చెత్త పేరుకుపోవడంతో రోగాలు ప్రబలుతున్నాయి.
పగలు దుర్వాసనతో, రాత్రి దోమలతో నరకం చూస్తున్నామని, పిల్లలు రోగాల బారినపడుతున్నారని, ఫిర్యాదు చేసినా జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదని ఎర్రగడ్డ కృష్ణవేణి స్కూల్ సమీపంలో కొత్తగా ఏర్పడిన జీవీపీ పాయింట్ బాధితులు వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త నిల్వ ఉండే ప్రాంతాలను (జీవీపీ) గుర్తించి, వాటిని శాశ్వతంగా తొలగించామని అధికారులు చెబుతున్నారే తప్ప.. వాస్తవానికి ఆ పాయింట్ల వద్ద వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఎల్బీనగర్లో 271, చార్మినార్లో 644, ఖైరతాబాద్లో 494, శేరిలింగంపల్లిలో 318, కూకట్పల్లిలో 359, సికింద్రాబాద్లో 446లు కలిపి మొత్తం 2529 చోట్ల జీవీపీ పాయింట్లు ఉన్నాయి. ఇక జీహెచ్ఎంసీలో విలీనమైన పురపాలికల్లో జీవీపీలు వీటిని అదనంగా ఉంటాయని అధికారులే చెబుతుండడం గమనార్హం.
రహదారులపైనే గుట్టలుగా చెత్త కుప్పలు
గడిచిన కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన రహదారుల వెంట పేరుకుపోయిన చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. తరచూ చెత్త వేసే ప్రాంతాలు (గార్భేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) జీహెచ్ఎంసీ పరిధిలో 2,529 ప్రాంతాలను గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారే తప్ప.. క్షేత్రస్థాయిలో వీటికి అదనంగా కొత్తగా జీవీపీ పాయింట్లు పుట్టుకొస్తున్నాయి. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ సరిగా జరగడం లేదు. ప్రధానంగా ఉప్పల్ చిలుకానగర్ నుంచి నాచారం మెయిన్ రోడ్, కవాడిగూడ ప్రధాన రహదారి, బన్సీలాల్పేట, ముషీరాబాద్, షేక్పేట దర్గా, ఓయూ కాలనీలో చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేసేస్తున్నారు.
మాదాపూర్ కావూరిహిల్స్ ప్రధాన రహదారి, పర్వత్నగర్తో పాటు పాతబస్తీలోని 70 శాతం ప్రాంతాల్లో అపరిశుభ్రత తాండవిస్తున్నది. చార్మినార్ నుంచి గుల్జార్ హౌస్ వెళ్లే దారిలో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఎర్రగడ్డ ప్రేమ్నగర్ కృష్ణవేణి స్కూల్ సమీపంలో కుప్పలు కుప్పలుగా చెత్త, ఇతర వ్యర్థాలతో ముక్కు పుటలదిరే దుర్వాసన వస్తున్నదని స్థానికులు చెబుతున్నారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు నిత్యం పరిధిలో పర్యటించాలి. కానీ అదెక్కడా జరగడం లేదు. జోనల్ కమిషనర్లు పెద్దగా పట్టించుకోకపోవడంతో చాలా మంది డిప్యూటీ కమిషనర్లు మధ్యాహ్నం తర్వాత కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో జీవీపీ పాయింట్లు గుట్టగుట్టలుగా వ్యర్థాలతో నిండిపోతున్నాయి. పారిశుధ్య విభాగంలో నిత్యం వందలాది సక్రమంగా విధులకు రావడం లేదనే ఆరోపణలు లేకపోలేదు.
అనేక లోపాలు
జీహెచ్ఎంసీ పరిధిలో పారిశుధ్య విభాగంలో 18 వేల మంది కార్మికులు, వందలాది మంది అధికారులు ఉన్నా ఫలితం శూన్యం. ఉదయం 6 గంటలకే క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్న నిబంధన ఉన్నా, ఏ ఒక అధికారి అటువైపు కన్నెత్తి చూడటం లేదు. జోనల్ కమిషనర్ల పర్యటన నామమాత్రంగానే ఉంది.
తనిఖీలు లేకపోవడంతో..
నగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లలో చెత్త కుప్పలు అత్యధికంగా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో గుర్తించారు. హోటళ్ల వ్యర్థాలు, రోడ్ల పకన వేసే చెత్తాచెదారంతో ఈ ప్రాంతాలు వ్యాధుల పుట్టలుగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇండోర్ నగరంలో మాదిరిగా ఎన్ ఫోర్స్ మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకపోవడమే ఈ దుస్థితికి కారణమని విమర్శలు వస్తున్నాయి. జవహర్నగర్ డంపింగ్యార్డుకు ప్రతి రోజూ 9,684 మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధి నుంచే 8500 మెట్రిక్ టన్నులు, ఇతర 14 మున్సిపాలిటీల నుంచి చెత్తను తరలిస్తున్నారు. ప్రత్యామ్నాయంగా ప్యారానగర్, లక్డారం, ఖానాపూర్లో అనుకున్నప్పటికీ పురోగతి లేకపోవడంతో జవహర్నగర్లోనే చెత్తను గుట్టగుట్టలుగా పారబోస్తున్నారు. తద్వారా పరిసర 30 గ్రామాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటున్నాయి.
రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై మండిపాటు
రోజూవారీ చెత్త సేకరణ చేయకపోవడం వల్లే వ్యర్థాలు పేరుకుపోతున్నాయని సీఎం రేవంత్రెడ్డి రెండు రోజుల కిందట స్వచ్ఛ ఆటో కార్మికులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై స్వచ్ఛ ఆటో కార్మికులు భగ్గుమంటున్నారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే ట్రై కార్పొరేషన్లలో పూర్తిగా స్వచ్ఛ ఆటోలన్నీ నిలిపివేస్తామని హెచ్చరించారు. అధికారులు ఇచ్చిన రిపోర్టులతో సీఎం మాట్లాడడం తగదని ఈ సందర్భంగా తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ కార్మికుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కలమడుగు రాజేందర్ అన్నారు.
సీఎం స్థాయిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపట్టారు. చెత్త సేకరణ చేస్తున్న కార్మికులు ఒక పక్క చనిపోతున్నారని, ఉదయాన్నే ఐదు గంటల నుంచి చెత్త సేకరణ చేస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికులను టార్గెట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్వచ్ఛ ఆటోలు ఉన్నాయని, గడిచిన రెండేండ్లుగా ఒక్క స్వచ్ఛ ఆటోను తీసుకురాలేదన్నారు. ఒక్కో డంపింగ్ యార్డు వద్ద వాహనాలు గంటల తరబడి అన్లోడింగ్కు సమయం తీసుకుంటాయని, అధికారుల పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపకుండా అనేక సమస్యలతో పనిచేస్తున్న కార్మికులనే పనిచేయడం లేదనడం బాధకరమన్నారు. స్వచ్ఛ ఆటోలకు జీహెచ్ఎంసీ కనీసం నెలవారీ ఈఎంఐలు చెల్లించడం లేదని రాజేందర్ గుర్తు చేశారు.