Hyderabad Metro | కొండలను చీల్చుకుంటూ.. మెట్రో రైలును పరుగులు పెట్టించడమే లక్ష్యంగా మెట్రో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ.. ఒక్కో దానికి ఒక్కో విధమైన పరిష్కార మార్గాన్ని చూపేందుకు ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన రోడ్లపై వంపులు తిరుగుతూ పరుగులు పెట్టిన మెట్రో రైలు.. కొత్తగా నిర్మించనున్న ఎయిర్పోర్టు మార్గంలో కొండలను సైతం చీల్చుకుంటూ ముందుకు సాగనున్నది. ఐటీ కారిడార్లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి మొదలై ఎయిర్పోర్టు వరకు చేపట్టనున్న మార్గంలో భూసేకరణ సమస్య తక్కువగా ఉన్నప్పటికీ రెండు చోట్ల ఫ్లై ఓవర్ల మీదుగా.. మరో రెండు చోట్ల ఏకంగా కొండల మీదుగా మెట్రో మార్గం కోసం పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. ఆ దిశగా ఇంజినీరింగ్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. నెలాఖరులోగా జనరల్ కన్సల్టెంట్ నియామకం పూర్తికానున్నది. తర్వాత 3నెలల పాటు నిర్మాణానికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ను తయారు చేసి, టెండర్లను పిలిచి నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): నిర్ణీత గమ్య స్థానాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మెట్రో అధికారులు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు మెట్రో వరకు చేపట్టిన మెట్రో ప్రాజెక్టులో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒక్కో దానికి ఒక్కో విధమైన పరిష్కార మార్గాన్ని చూపేందుకు ఇంజినీర్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన రోడ్లపై వంపులు తిరుగుతూ పరుగులు పెట్టిన మెట్రో రైలు..కొత్తగా నిర్మించనున్న ఎయిర్పోర్టు మార్గంలో కొండలను సైతం చీల్చుకుంటూ ముందుకు సాగనుంది.
మెట్రో స్టేషన్ నుంచి మొదలయ్యే ఎయిర్పోర్టు మెట్రో మార్గంలో రెండు చోట్ల ఫ్లై ఓవర్ల మీదుగా వెళ్తే.. మరో రెండు చోట్ల ఏకంగా కొండల మీదుగా వెళ్తున్నది. మొదట రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయో డైవర్సిటీ చౌరస్తాల్లో ఫ్లై ఓవర్ల మీదుగా వెళ్తే.. ఆతర్వాత వెంటనే ఖాజాగూడ చెరువు పక్కన నుంచి రోడా మేస్త్రీ సంస్థ మీదుగా నానక్రాంగూడ రోడ్డులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద కలుస్తుంది. ఇక్కడే చెరువు పక్కన ఎత్తయిన కొండలతో కూడిన ప్రాంతం ఉంది. ప్రతిపాదిత మెట్రో మార్గంలో భూ సేకరణ సమస్య తక్కువగా ఉన్నప్పటికి వెళ్లే మార్గంలో ఉన్న ఫ్లై ఓవర్లు, కొండ ప్రాంతాలే అధికారులకు సవాలుగా మారుతున్నాయి. కొండలను చీల్చకుండా మెట్రో మార్గం కోసం పిల్లర్లను నిర్మించాల్సి వస్తున్నది. ఇలా రెండు చోట్ల ఎత్తయిన కొండ ప్రాంతాలను గుర్తించిన మెట్రో అధికారులు ఆ ప్రాంతాలపై ప్రత్యేకంగా అధ్యయనం చేస్తున్నారు.
గ్రేటర్ చుట్టూ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డులో అక్కడక్కడ కొండలు ఎన్నో ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైంది రాజేంద్రనగర్, హిమాయత్సాగర్ చెరువు, కొత్వాల్ గూడ ప్రాంతంలోనే ఉంది. ప్రస్తుతం గచ్చిబౌలి వైపు నుంచి ఎయిర్పోర్టుకు వెళ్లే ఔటర్ రింగు రోడ్డు మార్గంలో రాజేంద్రనగర్ వద్ద భారీ ఎత్తయిన రాళ్లతో కూడిన కొండ ప్రాంతం ఉండడంతో కేవలం ఓఆర్ఆర్ ప్రధాన రహదారిని 8 వరసలతో నిర్మించి, ఇరువైపులా ఉండాల్సిన సర్వీసు రోడ్డును ఒకవైపు నుంచే మళ్లించారు. రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ నుంచి హిమాయత్సాగర్ చెరువు పక్కన నుంచి ఒకవైపే కొత్వాల్గూడ వెళ్లిన తర్వాత అక్కడి నుంచి మళ్లీ ఓఆర్ఆర్కు ఇరువైపులా సర్వీసు రోడ్డు ఉంటుంది. ఇలా సుమారు 2.30 కి.మీ పొడవునా కొండ ప్రాంతం ఉండడంతో సర్వీసు రోడ్డును సైతం నిర్మించలేదు. అయితే ప్రసుత్తం మెట్రో మార్గాన్ని నానక్రాంగూడ నుంచి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు మధ్యలోంచి నిర్మిస్తుండగా, హిమాయత్సాగర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని ఈసీ నది, ఎత్తయిన కొండ రావడంతో సర్వీసు రోడ్డు లేకపోవడంతో కొండలను తొలిచి మెట్రో మార్గాన్ని నిర్మించాల్సిన పరిస్థితి నెలకొంది. మెట్రో మార్గాన్ని మళ్లించే అవకాశాలు లేకపోవడంతో కొండలను తొలిచి మార్గాన్ని నిర్మించేందుకు భూమిని చదును చేయనున్నారు.
ఎయిర్పోర్టు మెట్రో లైన్ నిర్మాణానికి సంబంధించిన జనరల్ కన్సల్టెంట్ ఎంపికకు గడువు పూర్తయింది. ఈనెలాఖరు వరకు అర్హత కలిగిన సంస్థను ప్రకటిస్తామని ఎయిర్పోర్టు మెట్రో అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 5 కంపెనీలు ఎంపిక కాగా, వాటిలో ఒక దాన్ని ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించనున్నారు. జనరల్ కన్సల్టెంట్ నియామకం పూర్తయిన తర్వాత 3నెలల పాటు నిర్మాణానికి సంబంధించిన టెండర్ డాక్యుమెంట్ను తయారు చేసి, టెండర్లను పిలిచి నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తున్నది.