సుల్తాన్బజార్, మే 23: బాలికను కిడ్నాప్ చేసి, వివాహం చేసుకున్న ఓ ప్రబుద్ధుడు కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుల్తాన్బజార్ ఏపీసీ శంకర్, ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లాకు చెందిన హరికృష్ణ (30) సెంట్రింగ్ కార్మికుడు. మూడేండ్ల కిందట అతడికి వివాహమైంది. పలు కారణాలతో అతడికి భార్యతో గొడవ జరిగి విడాకుల వరకు వెళ్లింది. విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. ఇదిలా ఉండగా.. అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికతో హరికృష్ణకు పరిచయం ఏర్పడింది. ఆ బాలిక బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 11వ తేదీన ఆ బాలిక తన తోటి స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు ఎస్వీఎం గ్రాండ్ హోటల్కు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న హరికృష్ణ ఆ బాలికను మాయమాటలతో మభ్యపెట్టి సుల్తాన్బజార్ మెట్రో స్టేషన్ వద్ద నుంచి కిడ్నాప్ చేసి, విజయవాడకు తీసుకువెళ్లాడు. బాలిక కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారుపడ్డారు. బాలిక స్నేహితులతో విషయం తెలసుకొని ఈ నెల 13వ తేదీన తమ కూతురు కనిపించడం లేదంటూ సుల్తాన్బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించారు. బాలిక బుధవారం సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్కు వచ్చి హరికృష్ణ తనను కిడ్నాప్ చేసి, వివాహం చేసుకున్నట్లు వాంగ్మూలమిచ్చింది. దీంతో పోలీసులు గురువారం తెల్లవారుజామున హరికృష్ణను అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. విచారణలో అతడు బాలికను కిడ్నాప్ చేసి, విజయవాడకు తీసుకువెళ్లి 16న హనుమాన్ మంది రంలో వివాహం చేసుకోవడంతో పాటు ఓ లాడ్జిలో లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలిపాడు. దీంతో హరికృష్ణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన సెల్ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. నిందితుడికి నేరచరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ నెల 22న సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్కు వచ్చిన బాలిక.. తాను మైనర్ను కాదని, మేజర్ను అని పోలీసులకు తెలిపింది. తన పదో తరగతి సర్టిఫికెట్ను చూపించింది. ఆ సర్టిఫికెట్లో తప్పుగా పుట్టిన తేదీ పడిందని, పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో బాలిక జన్మించిన పత్రాలను తల్లి ఇవ్వడంతో సుల్తాన్బజార్ పోలీసులు వివరాలను సేకరించారు. ఆస్పత్రి పత్రాలతో బాలిక మైనర్గా నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత బాలిక వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి.. స్టేట్ హోంకు తరలించారు. నిందితుడు హరికృష్ణపై కిడ్నాప్, పోక్సో చట్టాల కింద పోలీసులు కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. నేరం రుజువైతే 20 ఏండ్ల శిక్షపడే అవకాశం ఉన్నదని ఏసీపీ స్పష్టం చేశారు.