మైలార్దేవ్పల్లి, మే 26 : ఆడిపాడాల్సిన వయస్సు.. తల్లిదండ్రులతో ఆనందంగా ఉండాల్సిన సమయం.. తోటిపిల్లలతో సరదాగా తిరిగే బాల్యం.. విధి వెక్కిరింపు వారిని దవాఖానల చుట్టూ తిరిగేలా చేసింది. ఎగిరిగంతులు వేయాల్సిన చిన్నారులు రక్తహీనతతో బాధపడుతూ కళ్లెదుటే అమ్మానాన్నలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. పిల్లల ఆయుష్షు పెంచేందుకు కన్నీళ్లు దిగమింగుతూ కష్టనష్టాల కోర్చి కృషి చేస్తున్నారు. రక్తహీనతతో వచ్చే వ్యాధి తలసీమియా. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. ఏ మాత్రం ఆలస్యమైనా వారు మంచం మీద నుంచి కదిలే పరిస్థితి ఉండదు. వీరికి రక్తం కోసం ఒక్కోసారి చెప్పులరిగేలా తిరుగుతుంటారు. కన్నపేగులను కాపాడుకునేందుకు వేలాదిరూపాయలు ఖర్చు చేస్తుంటారు. ఎవరైన దాతలు దొరుకుతారేమో అని కొండంత ఆశతో ఎదురు చూస్తుంటారు.
1998లో రాజేంద్రనగర్ నియోజకవర్గం శాస్త్రిపురం డివిజన్ రాఘవేంద్ర కాలనీలో కొంతమంది ఎన్జీవోలు కలిసి తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ (టీఎస్సీఎస్)ని ఏర్పాటు చేశారు. తొలుత 20 మంది పిల్లలతో ప్రారంభమైన ఈ సొసైటీ ప్రపంచంలోనే లాభాపేక్షలేని అతిపెద్ద ప్రభుత్వేతర సంస్థగా (ఎన్జీవో) మారింది. కాలానుగుణంగా ఆధునిక వసతులు, ల్యాబ్తో కూడిన దవాఖానను నిర్మించారు. తలసీమియా వ్యాధిని పూర్తిగా అంతం చేయడమే లక్ష్యంగా ఈ సొసైటీ పనిచేస్తుండగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది చిన్నారులు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. వీరికి కావాల్సిన రక్తాన్ని ఉచితంగా అందిస్తూ ప్రాణం పోస్తున్నారు. 2800 మంది చిన్నారులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం 50పడకల ట్రాన్స్ఫ్యూజన్ విభాగంలో ప్రతినిత్యం 40 నుంచి 50 మందికి రక్తాన్ని ఎక్కిస్తున్నారు. సొసైటీకి సొంతంగా బ్లడ్బ్యాంక్, ల్యాబోరేటరీ ఉంది. ప్రతినెలా ఉచిత మల్టీఆర్గాన్ స్క్రీనింగ్ శిబిరాలు జరుగుతుంటాయి. ఇందులో రీసెర్చ్ సెంటర్ కూడా పనిచేస్తున్నది.
కరోనా నేపథ్యంలో చాలాతక్కువ మంది రక్తదానం చేసేందుకు వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితు ల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థల చేయూత తో రక్తాన్ని సేకరించి పిల్లలకు ఇస్తు న్నాం. అనేకమంది యువకులు తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులను చూసి చలించి ఏడాదిలో మూడుసార్లు బ్లడ్ ఇస్తున్నారు. కులం, మతం అని లేకుండా యువత రక్తాన్ని దానం చేయొచ్చు. -చంద్రకాంత్ అగర్వాల్, టీఎస్సీఎస్ అధ్యక్షుడు