సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణానికి బస్సుల కొరత తీవ్రంగా ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి చెందిన ఎక్స్ప్రెస్, పల్లెవెలుగుతో పాటు నగరంలో మెట్రో ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులలో ప్రయాణికులు పోటెత్తడంతో ప్రస్తుతం తిరుగుతున్న బస్సులు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో నగరంలో తక్షణ అవసరాల కోసం 340 అద్దె బస్సుల కోసం గత నెలలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ కేవలం 50 అద్దె బస్సులకు మాత్రమే ఓనర్లు టెండర్లు దాఖలు చేశారు. వాటిని మాత్రమే ఖరారు చేస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కానీ మిగిలిన 290 అద్దె బస్సులకు టెండర్లు వేయడానికి యజమానులు ముందుకు రాలేదు. అయితే అద్దె బస్సుల యాజమానులు పలు డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీకి పలు మార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోక పోవడంతో ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతున్నట్లు అల్టిమేటం జారీ చేశారు. ఈ క్రమంలో 4న అద్దె బస్సుల ఓనర్లతో మరోసారి చర్చలు జరుపడానికి ఆర్టీసీ యాజమాన్యం ముందుకు వచ్చింది. అయితే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తేనే బస్సులు పెడుతామని లేదంటే తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ అద్దె బస్సు యాజమాన్యాల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అబ్బు మధుకర్రెడ్డి, గ్రేటర్ జోన్ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలో కొనసాగుతున్న 300 అద్దె బస్సులను సైతం నిలిపివేస్తామని హెచ్చరించారు.