సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): మొన్నటి వరకు వర్షాలు పడటంతో నగరవాసులు చల్లటి గాలులతో సేదతీరారు. కానీ గతకొన్ని రోజులుగా ఎండలు మండుతుండటంతో నగరంలోని ప్రజలు ఇండ్లకే పరిమితమవుతున్నారు. భానుడి భగభగతో మధ్యాహ్నం పూట రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. వేడిగాలులతో ఓ వైపు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అయితే చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఎండదెబ్బ (వడదెబ్బ)కు గురయ్యే ప్రమాదం ఉందని తగు జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్లో గత నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుండటంతో ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. నగరంలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40డిగ్రీలుగా నమోదవుతుండటంతో ఎండల తీవ్రత పెరిగింది. రాగల రోజుల్లో ఉష్ణోగ్రతలు 41-42డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశాలున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
వేడిని పెంచేవి వద్దే వద్దు..
వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరగడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా తప్పించుకోవచ్చు. బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా వెంట నీళ్ల బాటిల్ ఉండేలా చూసుకోవాలి. క్రమంతప్పకుండా నీళ్లు తాగుతూ ఉండాలి. వేసవికాలంలో ఆలహాల్, సిగరెట్ లాంటి అలవాట్లు శరీరాన్ని మరింత వేడి చేసేవిధంగా ఉంటాయి. కావున వాటికి దూరంగా ఉంటే మంచిది. లేదంటే వాంతులు, అలసట, తలవొప్పి, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. గుండె సంబంధిత, ఊపిరితిత్తుల వ్యాధులు, మూత్రపిండ సమస్యలతో బాధపడుతున్నవారు ఎకువగా ఎండలో తిరగకపోవడమే ఉత్తమం.
చిన్నారులు, వృద్ధులు మరింత భద్రం..
వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగితే ప్రతి జీవి ఇబ్బందులకు గురికావాల్సిందే. మరి చిన్నపిల్లలు, వృద్ధుల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అప్పుడే పుట్టిన పిల్లలు, పాలుతాగే వయసున్న వారికి కచ్చితంగా తల్లిపాలివ్వడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరిగితే చిన్నారుల బాడీ టెంపరేచర్ కూడా పెరుగుతుంటుంది. కావున పిల్లలకు, వృద్ధులకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎకువగా ఉంటాయి. ఎండలో ఆడుకోవడం వల్ల చెమట రూపంలో నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో శరీరానికి కావాల్సిన లవణాలు కోల్పోయి నీరసానికి గురవుతారు. అందుకే వారికి సాధ్యమైనంత మేరకు నీళ్లు తాగించడం మరువొద్దంటున్నారు. ముఖ్యంగా ఆరేండ్లలోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇలా చేస్తే అందం, ఆరోగ్యం..
పోషక పదార్థాలు ఎకువగా లభించే పండ్లు తీసుకోవడంతో పాటు కీరదోస, బీట్ రూట్, క్యారట్ లాంటి పచ్చి కూరగాయలు కూడా తీసుకోవడం శరీరానికి మంచిది. కొబ్బరి బోండాలు, మజ్జిగ, వేసవి సీజన్లో వచ్చే తాటిముంజలు చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో పాటు శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యతను కాపాడటానికి దోహదపడతాయని వైద్యులు సూచిస్తున్నారు. వీటిని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.
గణనీయంగా పెరిగిన విద్యుత్ వినియోగం..
నగరంలో గరిష్ఠంగా 3560 మెగావాట్ల డిమాండ్ ఉండగా.. రోజువారీ విద్యుత్ వినియోగం 75.06 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. ఈ వేసవి సీజన్లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక వినియోగమని డిస్కం అధికారులు వెల్లడించారు. మరింత డిమాండ్ పెరిగినా సరఫరా చేసే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు.