సిటీబ్యూరో, మేడ్చల్, రంగారెడ్డి, నవంబర్ 29(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికలకు హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పటాన్చెరు నియోజకవర్గంతో కలిపి మొత్తం 29 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 1,09,56,477 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నది.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉండడంతో పాటు అన్ని కేంద్రాల్లోని పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చర్యలు తీసుకునేందుకు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్లు, జిల్లా ఎన్నికల అధికారి, ఐసీసీసీ పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో స్క్రీన్ల ద్వారా పరిస్థితులను వీక్షించే సదుపాయం ఉంటుంది. ముఖ్యంగా మాడల్ పోలింగ్ కేంద్రాలు, మహిళలు, దివ్యాంగులు, యువత సిబ్బందిగా పోలింగ్ కేంద్రాలను నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, మూత్రశాలలు, వెలుతురు, వాలంటీర్లతో పాటు దివ్యాంగులకు ర్యాంప్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎపిక్ కార్డు లేకుంటే 12 కార్డులు
ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు ఐడీ లేకుంటే వేరే ఇతర 12 రకాల ఐడీ కార్డులకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఆధార్ కార్డు, పోస్టాఫీస్, బ్యాంక్ జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్బుక్, కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, ఆర్జీఐ ద్వారా జారీ చేసిన స్మార్ట్కార్డు, ఇండియన్ పాస్పోర్టు, ఫొటోతో కూడిన పింఛన్ మంజూరు డాక్యుమెంట్, ఫొటోతో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ గుర్తింపు కార్డు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, దివ్యాంగుల గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి వెంట తీసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.
పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు
జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2439 పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశాం. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు 135 ఉన్నాయి. వీటి లింక్ను రిటర్నింగ్ అధికారులు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాలకు అనుసంధానం చేశాం. ఎన్నికలకు సంబంధించి 369 రూట్ మ్యాప్ ఏర్పాటు చేశాం. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల నియమావళిని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి.
– మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
హైదరాబాద్ జిల్లా పరిధిలో..
హైదరాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 312 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. జిల్లా వ్యాప్తంగా 45,36,852 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. పోలింగ్కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 4119 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20వేల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటుండగా, బ్యాలెట్ యూనిట్లు 9318, కౌంటింగ్ యూనిట్లు 5132, వీవీ ప్యాట్స్ 5737లను వినియోగిస్తున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు 4947, పోలింగ్ అధికారులు 9894, మైక్రో అబ్జర్వర్లు 810 ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 369 రూట్లలో 369 సెక్టార్లలో సెక్టార్ ఆఫీసర్లు ఉంటారు.
ఓటర్ల వివరాలు
జిల్లా ఓటర్లు : 45,36,852
పురుషులు : 23,22,623
మహిళలు : 22,13,902
థర్డ్ జెండర్ : 327
మేడ్చల్జిల్లా పరిధిలో..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో మొత్తం 5 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 2439 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి బ్యాలెట్ యూనిట్లు, 6422 కంట్రోల్ యూనిట్లు 3050, వీవీ ప్యాట్ల 3373 వినియోగించనున్నారు. జిల్లాలో 28,19,067 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో ఇప్పటికే మౌళిక వసతులు కల్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అంగవైకల్యం, అంధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వృద్ధులు, అంధులకు గుర్తించిన కేంద్రాలలో వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. ఎపిక్ కార్డ్స్ 3,72,758 పంపిణీ చేయగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లీప్స్ 90శాతం పంపిణీ చేశారు. దివ్యాంగులకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాలో ఐదు, మహిళలకు ప్రత్యేకంగా నియోజవర్గానికి 5 చొప్పున 25 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఓటర్ల వివరాలు
జిల్లా ఓటర్లు : 28,19,067
పురుషులు : 14,59,629
మహిళలు : 13,59,057
థర్డ్ జెండర్ : 381
రంగారెడ్డి జిల్లా పరిధిలో..
రంగారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 209 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో పోటీపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 35,23,219 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 3,453 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15,212 మంది ఎన్నికల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 5,483 కంట్రోల్ యూనిట్లు, 9,943 బ్యాలెట్ యూనిట్లు, 5,389 వీవీ ప్యాట్లను ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు. 1,541 సమస్యాత్మక కేంద్రాలు ఉండగా 2,990 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ను, మరో 822 కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పటిష్ట నిఘాను ఉంచుతున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది.
ఓటర్ల వివరాలు
జిల్లా ఓటర్లు : 35,23,219
పురుషులు : 18,22,366
మహిళలు : 16,99,600
థర్డ్ జెండర్ : 1,253