రంగారెడ్డి, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టిమ్స్(తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్) నిరుపేదలకు వరంగా మారుతున్నది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో గతేడాది అత్యాధునిక ప్రమాణాలతో ఈ వైద్యశాలను ఏర్పాటు చేసిన విషయం విదితమే. 1261 పడకలున్న ఈ దవాఖాన ప్రస్తుతం తెలంగాణ వాసులకు సంజీవనిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు.
టిమ్స్లో 1261 పడకలుండగా.. 980 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఏ ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో లేని విధంగా 137 మెకానికల్ వెంటిలేటర్లతో కూడిన ఐసీయూలు అందుబాటులో ఉన్నాయి. అంతేగాక అత్యుత్తమ సౌకర్యాలతో పాటు 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటున్నారు. రోజులో రెండుమూడు సార్లు కొవిడ్ రోగుల వద్దకు వెళ్లి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఈ వైద్యశాలలో చేరిన వారంతా వారం నుంచి పదిరోజుల్లో సాధారణ స్థితికి వస్తుండటం విశేషం.
14 అంతస్తులున్న టిమ్స్లో ప్రతి ఫ్లోర్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ఒక్కో రూంలో ఇద్దరు కొవిడ్ రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. అంతేగాక ఈ వైద్యశాలలో చేరే కొవిడ్ రోగులకు డైటీషన్ల సూచన మేరకు నిర్ణీత సమయాల్లో ఉచితంగా ఆహారాన్ని అందజేస్తున్నారు. అయితే కొందరు కొవిడ్ రోగులు ప్రైవేట్కు వెళ్లి రూ.లక్షలు ఖర్చు చేసి చివరి నిమిషంలో టిమ్స్కు వస్తున్నారని.. అయినా వారికి మంచి వైద్యం అందించి పూర్తిగా నయం చేసి ఇంటికి పంపిస్తున్నామని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రం నుంచే కాక పొరుగు రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సాల నుంచి కొవిడ్ రోగులు వచ్చి టిమ్స్లో చికిత్స పొందుతుండటం గమనార్హం. ప్రతిరోజు వందల మంది టిమ్స్లో చేరుతుండగా.. అదేస్థాయిలో నయమై ఇంటికి వెళ్తున్నారు. ప్రస్తుతం టిమ్స్లో 650కి పైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్లోని గాంధీ, కింగ్కోఠి, నిమ్స్తో పాటు ఇతర వైద్యశాలల్లో కొవిడ్కు చికిత్స అందిస్తున్నా మెరుగైన వైద్యం కోసం టిమ్స్లో చేరేందుకు అనేక మంది రోగులు ఆసక్తి చూపుతున్నారు.
కొవిడ్ బారిన పడిన నేను టిమ్స్లో చేరా. వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో చికిత్స అందించారు. సకాలంలో మందులిచ్చారు. ఓపికగా రోగుల సమస్యలు తెలుసుకోవడం.. పోషకాహారం అందించడంతో పాటు మనోధైర్యం కల్పిస్తున్నారు. నాకు వారం రోజుల్లోనే నయం కావడంతో ఇంటికి పంపారు. -మీనాక్షి, హైదరాబాద్