కందుకూరు, జూన్ 23: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్డు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి గుడ్డుపై ‘తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ గుడ్డు’ పేరుతో స్టాంప్ వేసి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు నెలలో మూడు సార్లు గుడ్లను ఇస్తుండగా ఆయా కేంద్రాలకు కాంట్రాక్టర్ మూడు రంగుల్లో స్టాంపులు ముద్రించిన గుడ్డును సరఫరా చేస్తున్నారు. దీనిపై ఆయా కేంద్రాల్లో ముందస్తుగా సీడీపీఓ, సూపర్ వైజర్లు, టీచర్లకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోడిగుడ్డుపై బ్లూ, గ్రీన్, రెడ్ రంగుల్లో మూడు విడతల్లో ముద్రలు వేసి దశలవారీగా సరఫరా చేస్తున్నాం. లబ్ధిదారులకు తప్పకుండా చేరాలనే ప్రభుత్వ ఉద్దేశం బాగుంది. ఇలాంటి చర్యలతో అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. పౌష్టికాహారం పంపిణీని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. లబ్ధిదారులకు అందేలా పగడ్బందీ చర్యలు తీసుకుంటాం.
– షబాన, సీడీపీఓ మహేశ్వరం
అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నది. ప్రతి విడతలో లబ్ధిదారులు పౌష్టికాహారం తప్పనిసరిగా తీసుకోవాలి. ముద్రల పక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుంది. ప్రతి లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి.
– యాదమ్మ అంగన్వాడీ టీచర్, రాచులూరు