సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్వ్యాప్తంగా తెలంగాణ హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘తెలంగాణకు హరితహారం’ 9వ విడత ప్రారంభం ఒకవైపు.. దశాబ్ది స్ఫూర్తిగా జీహెచ్ఎంసీ అర్బన్ బయో డైవర్సిటీ విభాగం వినూత్నంగా 60 చోట్ల దశాబ్ది పార్కులను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చింది. జోన్కు 10 చొప్పున 60 చోట్ల అభివృద్ధి చేసిన తెలంగాణ దశాబ్ది పార్కులను స్థానికులతో కలిసి ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేటర్లు, కాలనీ వాసులందరినీ కలుపుకుని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్ వ్యాప్తంగా లక్ష మొక్కలను నాటారు.
తొమ్మిదో విడుత ‘కోటి’ లక్ష్యం..
9వ విడుతలో హరితహారం కింద కోటి మొక్కలను నాటాలన్న లక్ష్యంతో అధికారులు రంగంలోకి దిగారు. సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్ల పరిధిలో 600 నర్సరీల్లో కోటి మొక్కలను సిద్ధం చేశారు. ఎల్బీనగర్ , కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్లో ఒక్కో జోన్కు 20 లక్షలు, చార్మినార్, సికింద్రాబాద్లో ఒక్కో జోన్కు 14 లక్షలు, ఖైరతాబాద్ జోన్లో 12 లక్షల మొక్కల నాటాలని లక్ష్యం విధించుకున్నారు. ప్రధానంగా ఒక్కో కాలనీని యూనిట్గా తీసుకుని కాలనీలో ప్రవేశ ద్వారం నుంచి చివరి వరకు ఎటు చూసినా పచ్చదనంతో కళకళలాడేలా పండ్లు, పూల మొక్కలను నాటేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. డిసెంబరు నెలాఖరు నాటికి ఎంపిక చేసిన కాలనీల్లో అంతర్గత రహదారులు, సంస్థలు, ఖాళీ ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించనున్నారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో తెలంగాణ హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 1.90 లక్షల మొక్కలు నాటి, 126 చెట్లను ట్రాన్స్లోకేషన్ చేశారు. 200 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది డబుల్ డెక్కర్ బస్సులో కొత్వాల్గూడ ఎకో పార్కుకు చేరుకొని 25 వేల మొక్కలు నాటారు. అదేవిధంగా ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాలు, జంట నగరాల్లో 30 కేంద్రాల్లో 7 మంది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు మొబైల్ వాహనాల ద్వారా 1,50,000 మొక్కలను పంపిణీ చేశారు.
హరితోత్సవంలో భాగంగా కొత్వాల్గూడలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ దాదాపు 15 అడుగుల ఎత్తయిన మర్రి చెట్టును ట్రాన్స్లోకేషన్ చేశారు. బాచుపల్లి-మల్లంపేట రోడ్డు విస్తరణలో భాగంగా తొలగిస్తున్న 126 మర్రి, రావి జాతులకు సంబంధించిన చెట్లను హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ యంత్రాంగం కొత్వాల్ గూడ ఎకో పార్కులో ట్రాన్స్ లోకేషన్ చేసింది. ఈ సందర్భంగా అర్వింద్కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంలో భాగంగానే ప్రతి సంవత్సరం హెచ్ఎండీఏ పరిధిలో లక్షల మొక్కలు నాటుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ గ్రోత్ కారిడార్ మేనేజింగ్ డైరెక్టర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, హెచ్ఎండీఏ సెక్రటరీ చంద్రయ్య, ప్లానింగ్ డైరెక్టర్ శివశరణప్ప, చీఫ్ అకౌంట్ ఆఫీసర్ విజయలక్ష్మి, భూ సేకరణ అధికారి ప్రసూనాంబతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఔటర్ రింగురోడ్డుతో పాటు ఇతర ప్రాంతాల్లో హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన పచ్చదనం ప్రాజెక్టులపై కొత్వాల్గూడలో ఫొటో ఎగ్జిబిషన్ను నిర్వహించారు. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఫొటోలను సేకరించిన అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న పచ్చదనంతో పాటు ఇంటర్చేంజ్లు, అర్బన్ ఫారెస్ట్ బ్లాకులు, పార్కులు, రోడ్ల వెంబడి ల్యాండ్ స్కేపింగ్లతో కూడిన పోటోలు ఇందులో ఉన్నాయి.
తెలంగాణ హరితోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉచితంగా మొక్కల పంపిణీ చేపట్టారు. హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగానికి చెందిన అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని నర్సరీల నుంచి మొక్కలను వాహనాల్లో తీసుకువెళ్లి ప్రజలకు పంపిణీ చేశారు. పండ్లు, పూల మొక్కలతో పాటు వివిధ రకాల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసినట్లు అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు.