Hyderabad | సిటీబ్యూరో, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): బీపీ, షుగర్, థైరాయిడ్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న నాన్ కమ్యూనికేబుల్ డిసీజస్(ఎన్సీడీ)కిట్స్ను గ్రేటర్ పరిధిలోని అన్ని బస్తీ దవాఖానల్లో ఉచితంగా అందజేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. వృద్ధులు, ఆరోగ్య కేంద్రాలకు రాలేని వికలాంగులు, ఇతర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రతి నెలా వారి ఇంటి వద్దకే వెళ్లి ఎన్సీడీ కిట్స్ ఇస్తున్నట్లు చెప్పారు.
గ్రేటర్లోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా దవాఖానలతో పాటు నగరంలో 184 బస్తీ దవాఖానల్లో సైతం ఈ కిట్స్ను ప్రతి నెలా అందజేస్తున్నట్లు తెలిపారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే రోగులు తమ నివాసాలకు దగ్గరలో ఉన్న బస్తీ దవాఖానల్లోనే మందులను ఉచితంగా పొందవచ్చని సూచించారు.