మారేడ్పల్లి, మే 27 : అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సికింద్రాబాద్లోని ఎస్వీఐటీ కళాశాల ఆడిటోరియంలో శనివారం జరిగిన కార్యక్రమంలో జైన్ సేవా సంఘ్కు ఉప్పల్ భగాయత్లో కేటాయించిన 2 ఎకరాల భూమి మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో నివసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ తమ బిడ్డలేనని, వారికి అండగా ఉంటామని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించిందని.. రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తూ వేధింపులకు గురిచేస్తోందన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన తేల్చిచెప్పారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులు.. ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తిరుమలకు దీటుగా యాదాద్రి ఆలయ నిర్మాణం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే గొప్ప హిందువు దేశంలో మరెవరూ లేరని తలసాని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జైన్ సేవా సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు.