అల్వాల్ పీహెచ్సీలో తెలంగాణ డయాగ్నోస్టిక్స్-మినీ హబ్ ఏర్పాటు
నిత్యం 25-30 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
గర్భిణులకే ఎక్కువగా లబ్ధి
అల్వాల్, మే 25: పేదలకు వైద్యపరీక్షల ఖర్చు తలకు మించిన భారంగా మారింది. చాలామంది ప్రైవేటు వైద్యులు రోగం ఒకటుంటే.. దానికి సంబంధం లేని టెస్టులు కూడా రాస్తుంటారు. దీంతో ప్రైవేటు ల్యాబ్ల్లో టెస్టులు చేయించుకోవాలంటే వేల రూపాయలు కావాలి. అయితే పేదల వైద్యపరీక్షలకు అవుతున్న ఖర్చును గమనించిన తెలంగాణ ప్రభుత్వం వారికి ఉపశమనం కల్పించాలని సంకల్పించింది. ఇందులో భాగంగానే తెలంగాణ డయాగ్నోస్టిక్స్-మినీ హబ్లను అల్వాల్ పీహెచ్సీలో ఏర్పాటు చేసింది. ఇటీవల ఈ ల్యాబ్ను ఎమ్మెల్యే హన్మంతరావు ప్రారంభించగా.. తాజాగా సేవలు అందుబాటులోకి వచ్చాయి.
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
అల్వాల్లోని తెలంగాణ డయాగ్నోస్టిక్స్-మినీ హబ్ సోమవారం నుంచి శుక్రవారం వరకు తెరిచి ఉంటుంది. సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు రేడియాలజిస్ట్ అందుబాటులో ఉండి స్కానింగ్ తీస్తారు. అన్నిరోజుల్లో ఎక్స్రే, ఈసీజీ, ఇతర మూత్ర, రక్త పరీక్షలు చేస్తూనే ఉంటారు. కొత్తగా ఏర్పాటైన ఈ మినీ హబ్కు నిత్యం 25-30 మంది పరీక్షలు చేయించుకునేందుకు వస్తున్నారు. ఇందులో దాదాపు 20 కేసులు గర్భిణులకు సంబంధించినవే. ముఖ్యంగా పీహెచ్సీకి వచ్చే గర్భిణులకు ఈ ల్యాబ్ ఎంతో ఉపయోగకరంగా మారింది. సాధారణంగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు నాలుగు సార్లు స్కానింగ్ అవసరం పడుతుంది. ప్రైవేటులో అయితే ప్రతిసారి రూ.1000నుంచి 1500 వరకు ఖర్చవుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి పైసలు తీసుకోకుడా ఉచితంగా గర్భిణులకు స్కానింగ్ తీసి పంపిస్తున్నారు. ఇక్కడ అల్వాల్ పీహెచ్సీతోపాటు మచ్చబొల్లారం, సుభాశ్ నగర్ యూపీహెచ్సీ సెంటర్ల పరిధిలోని అల్వాల్, కౌకూర్, యాప్రాల్, అరుంధతీనగర్, తుర్కపల్లి, అంబేడ్కర్ నగర్, గోకుల్ నగర్ పరిధిలోని ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. 20 బస్తీ దవాఖానల పరిధిలోని వారికి కూడా సేవలు అందుతున్నాయి.
రూ.25 లక్షలతో అధునాతన పరికరాలు
తెలంగాణ డయాగ్నోస్టిక్స్-మినీ హబ్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం, ఈసీజీ, ఎక్స్రే మిషన్లు, 57 రకాల పరీక్షలకు సంబంధించిన రక్త, మూత్ర పరీక్షల కిట్లను ఏర్పాటు చేశారు. వీటికి రూ.25 లక్షలు వెచ్చించినట్లు ఎమ్మెల్యే హన్మంతరావు వెల్లడించారు. స్కానింగ్ తీయడానికి ఓ రేడియాలజిస్ట్తోపాటు మరో నలుగురు సిబ్బందిని కేటాయించారు. ల్యాబ్కు వచ్చే రోగుల వివరాలను కంప్యూటర్లో నమోదు చేసి, అవసరమైన వైద్యపరీక్షలు చేసి పంపుతున్నారు.