మేడ్చల్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి సర్వనాశనం అవుతుందని మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Malla reddy ) పేర్కొన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డులో మంగళవారం పర్యటించి, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎవరూ ఊహించని విధంగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని అన్నారు.
నాలుగున్నరేళ్ల కాలంలో రోడ్లు, తాగునీరు, కరెంట్, పార్కుల ఏర్పాటు, జిల్లా గ్రంథాలయ సంస్థ భవనం తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేశానని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించానని వెల్లడించారు. సీఎం కేసీఆర్(CM KCR) సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు దేశానికి ఆదర్శంగా నిలిచాయమన్నారు.
బీఆర్ఎస్ (BRS) మరోసారి అధికారంలోకి రాగానే పింఛన్లు దశల వారీగా రూ. 5 వేలు పెంచుతామని, రైతుబీమా తరహా అర్హులకు రూ. 5 లక్షల బీమా పథకం అమలు అవుతుందని, ఆరోగ్య బీమా రూ.15 లక్షలకు పెంచనుందని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.400 కానుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పరని, ఎన్నికల్లో మెనిఫెస్టోలోనే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతారని అన్నారు.
కాంగ్రెస్ (Congress) చేతికి రాష్ట్రాన్ని అప్పగిస్తే అంధకారమే అవుతుందని, పథకాలు నిలిచిపోతాయని తెలిపారు. అభివృద్ధి కావాలా? వినాశనం కావాలా ప్రజలు తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికానర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు మర్రి నర్సింహ రెడ్డి, విష్ణుచారి తదితరులు పాల్గొన్నారు.
సదర్ ఉత్సవంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి
దీపావళి పండుగను పురస్కరించుని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లి వీరాంజనేయ దేవాలయ ప్రాంగణంలో స్థానిక యాదవ సంఘం అధ్యక్షుడు పాశం బుచ్చియాదవ్, సంఘం ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో మంత్రి పాల్గొన్నారు.