సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ) : 11 శాతం ఫిట్మెంట్ పెంపు ఏమో గానీ కండక్టర్లు, డ్రైవర్లకు పనిభారం పెరిగింది. ప్రభుత్వం జూలై నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు 11 శాతం ఫిట్మెంట్తో జీతాలు పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ విధానంతో నెలకు రూ. 3 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడుతుంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం ఆదాయం పెంచడం కోసం సిబ్బందిపై ఒత్తిడి తీసుకొస్తుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అందులో భాగంగా కండక్టర్లకు టార్గెట్స్ పెంచి ఇస్తున్నారు. డ్రైవర్లకు అదనపు గంటలు జోడించి విధులు ముగిసినా మరో రెండు నుంచి మూడు గంటల వరకు బస్సు నడిపేలా ఆదేశాలు ఇచ్చినట్టు బాధితులు తెలిపారు. నగరంలో ఒక్కో కండక్టర్కు రోజుకు 6500 రూపాయల వరకు టార్గెట్లు విధించారు. అయితే అందులో మహాలక్ష్మి ఉచిత బస్సు టికెట్లు మినహాయించారు. దీంతో కండక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల నిండా ఉచిత బస్సు టికెట్లే జారీ చేయాల్సి వస్తుందని, వాటిని మినహాయిస్తే టార్గెట్ అందుకోలేమని చెబుతున్నారు.
ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేసి కండక్టర్లు, డ్రైవర్లకు ఆదేశాలిచ్చినట్టు కొందరు తెలిపారు. ఉన్నతాధికారులు డిపో మేనేజర్లపై ఒత్తిడి తీసుకొస్తే..వాళ్లు కండక్టర్లకు టార్గెట్లు పెట్టి వేధిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉచిత బస్సు పథకంతో తాము నరకం చూస్తున్నామని ఓ డిపోకు చెందిన మహిళా కండక్టర్ కన్నీటి పర్యంతమైంది. కారణం లేకుండానే మెమోలు, సస్పెండ్లు చేస్తున్నారని వాపోయారు. ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి సుమారు 417 మంది డ్రైవర్లు, కండక్టర్లు సస్పెండ్ అయ్యారు. మరికొందరికి మెమోలు జారీ చేసిన విషయం తెలిసిందే. 11 శాతం జీతాలు పెంచారని టార్గెట్ పెంచడం సరైంది కాదని వాపోయారు.
గ్రేటర్లో ఉచిత బస్సుకు ముందు రోజుకు 11 లక్షల మంది ప్రయాణం చేసేవాళ్లు. ఇందులో మహిళా ప్రయాణికులు 5 లక్షల మంది ఉండేవాళ్లు. ఉచిత ప్రయాణం తర్వాత రోజుకు సుమారు 25 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో 17 లక్షల మంది మహిళలే ఉండటం విశేషం. ఒక్క రోజుకు ఇంత మంది ప్రయాణం కేవలం గ్రేటర్లో ఉన్న 2600 బస్సులపైనే ఆధారపడి ఉంది. సిటీ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉంటే 30 మంది మహిళలే ఉంటున్నారు. దీంతో ప్రతీ బస్సు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నది. దీంతో పురుషులు కూడా ప్రత్నామ్నాయ మార్గాలను అన్వేశిస్తున్నారు.
అంతేకాదు గ్రేటర్ జోన్లో గతంలో రోజువారి ఆదాయం రూ.4కోట్లు ఉంది. నేడు రూ.2కోట్ల నుంచి 2.5 కోట్లకు తగ్గిందని లెక్కలు చెబుతున్నాయి. ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టి ఆదాయాన్ని తగ్గించుకొని ఇప్పుడు టార్గెట్ల పేరుతో తమను వేధించడం సరికాదని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ కష్టాలను బయటకు చెప్పుకొంటే అధికారులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓ సంఘానికి చెందిన నాయకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. రోజుకు 170 కిలోమీటర్లు దాటి నగరంలో బస్సులు నడపాల్సి వస్తుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బస్సు 130 కిలో మీటర్ల లోపు నడపాల్సి ఉంటుందని తెలిపారు. ఇక జిల్లాల్లో 350 కిలో మీటర్లు దాటి నడిపినా టార్గెట్లు రీచ్ అవ్వలేకపోతున్నామని పేర్కొన్నారు.