సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ అదే స్ఫూర్తి, అంకిత భావంతో ప్రజలకు సేవలందించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురసరించుకొని, విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 93 మంది పోలీసు సిబ్బందికి కమిషనరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో పలు సేవా పతకాలను అందజేశారు. ఈ సందర్బంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ.. ప్రజా రక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి గుర్తింపునిచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను అందజేస్తుందని, ఇందులో భాగంగా 2022 సంవత్సరానికి గానూ సైబరాబాద్ పరిధిలో 93 మంది పోలీసు సిబ్బందికి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశామన్నారు. ఇందులో 8 అతి ఉత్కృష్ట, 18 ఉత్కృష్ట, 10 సేవా పతకాలు కలిపి 36 మెడల్స్, 57 ప్రశంసా పత్రాలు అందజేసినట్లు తెలిపారు. పతకాలు అందుకున్న వారిలో హోమ్ గార్డు నుంచి ఏడీసీపీ ర్యాంక్ వరకు ఉన్నట్లు వివరించారు. డీజీపీ కమ్మాండేషన్ తీసుకున్నవారిలో సీసీఎస్ అడిషనల్ డీసీపీ జి. నరసింహా రెడ్డి, శశాంక్ రెడ్డి, ఏసీపీ చంద్రశేఖర్, ఏసీపీ శ్యామ్బాబు, ఏసీపీ రఘునందన్ రావు, బాలానగర్ సీసీఎస్ ఇన్స్పెక్టర్ బాలరాజు, శంకర్పల్లి ఇన్స్పెక్టర్ ప్రసన్నకుమార్, చేవెళ్ల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వాసు ఉన్నట్లు వివరించారు. పోలీసుశాఖలో విధులు నిర్వహించడం, అందులో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎటువంటి రిమారులు లేకుండా పతకాలు అందుకోవడం సంతోషకరమని, ఇదే స్ఫూర్తితో విధుల పట్ల అంకితభావం, మంచి ప్రతిభ కనబరిచి, ప్రజలకు సేవలందించాలని పోలీసు సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) నారాయణ్ నాయక్, అడ్మిన్ డీసీపీ యోగేశ్ గౌతమ్, సైబర్ క్రైమ్స్ డీసీపీ రితిరాజ్, షీ టీమ్స్ డీసీపీ నితికా పంత్, రాజేంద్రనగర్ అడిషనల్ డీసీపీ రష్మీ పెరుమల్, ఈఓడబ్ల్యూ డీసీపీ ధార కవిత, బాలానగర్ డీసీపీ, మాదాపూర్ ఇన్చార్జి డీసీపీ శ్రీనివాసరావు, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, రాజేంద్రనగర్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.