Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని, స్థాయికి తగినట్లు హుందాగా వ్యవహరించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హితవు పలికారు. శనివారం సికింద్రాబాద్లోని తహసీల్దార్ కార్యాలయంలో 19 మంది లబ్ధిదారులకు షాదీముబారక్ (15), కళ్యాణ లక్ష్మీ (4) ఆర్థికసాయం చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకుండా వాటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇస్తామని రెండేళ్లు అవుతున్నా నేటి వరకు ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదని, ఎప్పుడు ఇస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు ప్రతి నెలా అందిస్తామన్న 2500 రూపాయలు ఏమయ్యాయని, వికలాంగులకు 3 వేల నుంచి 6 వేలకు పెంచుతామన్న పెన్షన్ ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు నిర్మిస్తారని పేదలు అడుగుతున్నారని వీటికి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తొండలు వదులుతా.. పేగులు మెడలో వేసుకుంటా అంటూ ముఖ్యమంత్రి అని మాట్లాడటం విచారకరమని అన్నారు. బూతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న గౌరవాన్ని దిగజార్చుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలని, మంచి పనులు చేసి ప్రజల మన్ననలను పొందారని సూచించారు.
డీ లిమిటేషన్ పేరుతో ప్రభుత్వం, అధికారులు ఇష్టానుసారంగా జీహెచ్ఎంసీలోని డివిజన్లను ఏర్పాటు చేశారని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. దీనిపై కమిషనర్కు ఫిర్యాదు చేసినా, కౌన్సిల్ సమావేశాలలో అభ్యంతరాలు తెలిపినా పట్టించుకోలేదని విమర్శించారు. హడావుడిగా డివిజన్ లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఎవరికి అర్ధం కావడం లేదన్నారు. అధికారంలో ఉన్నాం… మా ఇష్టమొచ్చినట్లు చేస్తాం అన్నట్లుగా ప్రభుత్వ వైఖరి ఉందని విమర్శించారు. సికింద్రాబాద్ జోనల్ ఆఫీస్ మోండా డివిజన్ పరిధిలో ఉంటే మోండా డివిజన్ ను తీసుకెళ్లి మల్కాజ్ గిరిలో కలపడమేంటని ప్రశ్నించారు. మీ విధానాలు మార్చుకోకపోతే ప్రజలు బండకేసి కొడతారని ధ్వజమెత్తారు.