సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ప్రపంచీకరణకు అనుగుణంగా ఉన్నత విద్య పాఠ్యప్రణాళికలో మార్పులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆర్. లింబాద్రి అన్నారు. ప్రపంచ దేశాలతో పొటీ పడాలంటే అన్ని దేశాలకు అనుకూలంగా కామన్ సిలబస్ విధానం అందుబాటులో ఉండాలన్నారు. బుధవారం సెస్ వేదికగా ‘ది తెలంగాణ కరికులం డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ అనే అంశంపై బ్రిటిష్ కౌన్సిల్తో కలిసి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో రెండు రోజుల వర్క్షాపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత విద్యలో కొత్త కరికులం అభివృద్ధి కోసం ఉన్నత విద్యా మండలి నుంచి అన్ని రకాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్మిట్టల్ మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబస్లో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర విద్యా శాఖ సెక్రెటరీ వాకాటి కరుణ మాట్లాడుతూ..రాష్ట్రంలో చేపట్టిన కొత్త కార్యక్రమాలు యూఎస్ఏ సంస్థలతో సమానంగా విద్య, నైపుణ్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుందన్నారు.
మానవీయ శాస్ర్తాలు, సామాజిక శాస్ర్తాలు యూజీ సిలబస్లో చేర్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు మెరుగు పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ కౌన్సిల్ ప్రతినిధి జనక పుష్పనాథన్తో పాటు బ్రిటీష్ కౌన్సిల్ ప్రతినిధులు, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్యాదవ్, ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ శ్రీరామ్వెంకటేశ్, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి, యూనైటెడ్ కింగ్డమ్కు చెందిన బెంగార్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ నికోలా కల్లో, అబెరిస్టే యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ తిమోదీ వుడ్స్, తదితరులు పాల్గొన్నారు.