బౌద్ధనగర్ : సికింద్రాబాద్ లో రెండు కత్తి పోట్ల కేసులు చేధించామని అదనపు సీపీ చౌహాన్ తెలిపారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సంతోష్ పై కత్తితో దాడి చేసిన కేసులో నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. ఆదివారం సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు.
అంబర్నగర్ ఏకశిల మెడికల్ హాల్ వద్ద సంతోష్ పై కత్తితో దాడి చేసిన కేసులో నవాజ్, షేక్ సబీర్, షరీఫ్ ఖాన్లను అరెస్టు చేశామని తెలిపారు. పాత కక్షల కారణంగా సంతోష్, నవాజ్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం చెలరేగింద న్నారు.
గత నాలుగు ఏండ్లుగా ఇద్దరికీ పరిచయం ఉందని , నిందితుడు కొన్నెండ్ల క్రితం పిల్లలను కొడుతుంటే సంతోష్ అడ్డుకోవడమే కక్ష కు కారణమన్నారు. ఈనెల 22న ఆటోలో వచ్చిన నవాజ్ సంతోష్ తో వాగ్వాదానికి దిగి కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ సంతోష్ను స్థానికులు సికింద్రాబాద్ గాంధీ దవాఖానాకు తరలించారని వివరించారు.
ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. నిందితుడు నవాజ్పై గతంలో నల్లకుంట, ముషీరాబాద్ పీఎస్ లలో కూడా కేసులు ఉన్నాయని తెలిపారు.
మరో ఘటన బేగంపేటలో..
ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో బేగంపేట పీఎస్ పరిధిలోని రసూల్పురలో ప్రదీప్ పై కత్తితో దాడి చేసిన 7గురిని అరెస్టు చేశామని అదనపు సీపీ వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న గంటల్లోనే తమ పోలీసులు కేసును చేధించినట్లు చెప్పారు. ప్రదీప్తో గొడవ పడి ఏడుగురు వ్యక్తులు అతని పై కత్తితో దాడికి పాల్పడ్డారు.
ప్రదీప్, మునీర్ల మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో మునీర్ ప్రదీప్ పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాడు. దీంతో ప్రదీప్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రదీప్ స్నేహితుడు హేమంత్ కూడా గాయపడ్డాడు. ఈదాడిలో గాయపడ్డ హేమంత్ బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి 7గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.